పూణేలో విషాదం.. భర్త కళ్లముందే భార్య వర్షపు నీటిలో కొట్టుకుపోయింది!
పూణేలో బుధవారం రాత్రి నాలుగు గంటల పాటు ఏకధాటిగా కురిసిన కుండపోత వర్షం జన జీవనాన్ని అస్తవ్యస్తం చేసింది. ఈ వర్షం కారణంగా 18 మంది ప్రాణాలు కోల్పోయారు.
పూణేలో బుధవారం రాత్రి నాలుగు గంటల పాటు ఏకధాటిగా కురిసిన కుండపోత వర్షం జన జీవనాన్ని అస్తవ్యస్తం చేసింది. ఈ వర్షం కారణంగా 18 మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే, ఈ వర్ష బీభత్సంలో పూణే సహ్కార్ నగర్ ప్రాంతంలోని టాంగేవాలే కాలనీలో దారుణ విషాదం చోటు చేసుకుంది. వర్షపు నీటిలో ఒక మహిళ తన భర్త కళ్ళెదుటే కొట్టుకుపోయి ప్రాణాలు కోల్పోయింది. ఆమెను రక్షించడానికి ఆమె భర్త చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.
టాంగేవాలే కాలనీకి చెందిన సంజయ్ రాణె భార్య జోత్స్న(40) ఆయన కళ్లెదుటే వరదల్లో కొట్టుకుపోయారు. ఈ ఘటనపై సంజయ్ ఇలా వివరించారు. ''ఒక్కసారి వరద నీరు పోటెత్తడంతో ఇంట్లోంచి బయటపడేందుకు ప్రయత్నించాం. భారీ ప్రవాహం ధాటికి జోత్స్న నా కళ్ల ముందే నీటిలో కొట్టుకుపోయింది. ఆమెను కాపాడలేపోయాను. తర్వాత ఆమె మృతదేహం సమీపంలో లభ్యమైంది. మా కుటుంబానికి ఇది ఊహించని షాక్. ముఖ్యంగా పదేళ్ల మా కుమారుడు వరద్ చిన్న వయసులోనే అమ్మను కోల్పోయాడు'' అంటూ కన్నీరు మున్నీరు అయ్యారు.
గంగతీర్థ సొసైటీ వెనుక భాగంగా టాంగేవాలే కాలనీ ఉంది. సొసైటీ వెనుక భాగంలోనే కాలువ ఉంది. ఆక్రమణల కారణంగా ఈ కాలువ
కుచింకుపోయింది. కుండపోతగా వాన కురవడంతో కాలువ పోటెత్తడంతో సమీపంలోని కాలనీలు అన్ని వరదలో చిక్కుకున్నాయి. నీటి ప్రవాహం ఒక్కసారిగా పెరగడంతో కాలనీ వాసులు ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని ఇళ్లపైకి, సురక్షిత ప్రాంతాలకు పరుగులు తీశారని స్థానికుడు గోపినాథ్ జాదవ్ తెలిపారు. వరదల బారి నుంచి తప్పించుకునే క్రమంలో ఆయన కాలికి గాయమైంది. భారీ వర్షాల కారణంగా తమ ఇళ్లలోని వస్తువులన్నీ దెబ్బతిన్నాయని, వర్షాలు ఇలాగే
కొనసాగితే తామంతా షెల్టర్లు చూసుకోవాల్సి ఉంటుందని యమునాబాయ్ షిండే అనే వృద్ధురాలు వాపోయారు. కుండపోత విధ్వంసానికి 800పైగా జంతువులు చనిపోయాయి. 2 వేలకు పైగా వాహనాలు మునిపోయాయి. ముందు జాగ్రత్తగా గురువారం పుణేలోని పాఠశాలలు, కాలేజీలకు సెలవు ప్రకటించారు.