Bengal Election 2021: పశ్చిమ బెంగాల్లో ప్రారంభమైన ఆరో విడత ఎన్నికల పోలింగ్
Bengal Election 2021: బెంగాల్ లో ఆరో విడతలో భాగంగా 43 అసెంబ్లీ స్థానాలకు గురువారం పోలింగ్ జరుగుతోంది.
West Bengal Assembly Election 2021 Sixth Round
Bengal Assembly Election 2021: వెస్ట్ బెంగాల్ లో 8 విడతల్లో అసెంబ్లీ ఎన్నికలు జరపాలని ఈసీ నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ఈ రోజు ఆరో విడత ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఆరో విడతలో భాగంగా 43 అసెంబ్లీ స్థానాలకు గురువారం పోలింగ్ జరుగుతోంది. రాష్ట్రంలో కరోనా కేసులు భారీగా విస్తరిస్తున్న తరుణంలో ఆరో దఫా ఎన్నికలను కోవిడ్ నిబంధనలతో పకడ్భందీగా నిర్వహిస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగా అన్ని ప్రాంతాల్లో కేంద్ర బలగాలను మోహరించారు.
అధికార టీఎంసీ, బీజేపీ గట్టిగా పోటీపడుతున్నాయి. ఈ రోజు జరిగే ఎన్నికల్లో.. బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు ముకుల్ రాయ్, తృణమూల్ కాంగ్రెస్ సీనియర్ నేతలు జ్యోతిప్రియ మల్లిక్, చంద్రిమ భట్టాచార్య, సీపీఐ(ఎం) తరఫున తన్మయ్ భట్టాచార్య ఉన్నారు. వీరితో పాటు టీఎంసీ తరఫున బరిలో ఫిల్మ్ డైరక్టర్ రాజ్ చక్రవర్తి, నటి కౌషాని ముఖర్జీ తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.
కాంగ్రెస్, వామపక్ష కూటమి కూడా తీవ్రంగా ప్రయత్నం చేస్తోంది. ఆరో దశ ఎన్నికల్లో భాగంగా బెంగాల్లోని ఉత్తర 24 పరగణాలు జిల్లాలోని 17 స్థానాలకు, నదియా జిల్లాలోని 9స్థానాలకు, ఉత్తర్ దినాజ్పుర్ జిల్లాలోని 9 స్థానాలకు, పూర్వ బర్ధామన్ జిల్లాలోని 8 స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. 14,480 పోలింగ్ కేంద్రాల్లో ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 6:30గంటల వరకు ఓటింగ్ కొనసాగనుంది. 1.03 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. కాగా.. ఈరోజు జరుగుతున్న 43 సీట్లల్లో 306 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.