Congress vs BJP: అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవంపై బీజేపీ వర్సెస్ కాంగ్రెస్
Congress vs BJP: బీజేపీ తీరును తీవ్రంగా ఖండిస్తోన్న కాంగ్రెస్
Congress vs BJP: అయోధ్యలో శ్రీరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమంపై దేశవ్యాప్తంగా రాజకీయ మంటలు చెలరేగుతున్నాయి. ముఖ్యంగా బీజేపీ తీరును కాంగ్రెస్ తీవ్రంగా ఖండిస్తోంది. రామమందిరం ప్రారంభోత్సవాన్ని బీజేపీ ఓ రాజకీయ కార్యక్రమంగా నిర్వహిస్తోందని కాంగ్రెస్ ఆరోపించింది. నిర్మాణం పూర్తి కాకుండా ఆలయాన్ని ప్రారంభించటం సరికాదని అభిప్రాయపడింది.
అయోధ్యలో రామాలయం ప్రారంభోత్సవం ధర్మశాస్త్రాలు, విధివిధానాల ప్రకారం జరగటం లేదని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి పవన్ ఖేడా ఆక్షేపించింది. ఇదే విషయాన్ని దేశంలోని నాలుగు పీఠాల శంకరాచార్యులు చెబితే వారిని పక్కనపెట్టారని ఆయన తెలిపారు. ఆలయ ప్రారంభ తేదీని పంచాంగం చూడకుండా ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని నిర్ణయించారని పవన్ ఖేడా ఆరోపించారు. ఇది ధార్మిక కార్యక్రమం కానప్పుడు రాజకీయ కార్యక్రమమే అవుతుందన్నారు.
భక్తుడికి, దేవుడికి మధ్య దళారీగా రాజకీయ నాయకులు కూర్చోవడం తగదని, ఇది రాజకీయ కార్యక్రమం కాదని పవన్ ఖేరా స్పష్టం చేశారు. రామాలయ ప్రారంభోత్సవాన్ని 22న నిర్ణయించారు. బీజేపీ ఏ పంచాంగం చూసి ఆ తేదీ నిర్ణయించింది? ఆ తేదీని ఎంపిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఖరారు చేశారు అని కాంగ్రెస్ అధికార ప్రతినిధి పవన్ ఖేడా ఆరోపించారు. ఇప్పటికే రామాలయం ఓపెనింగ్ కార్యక్రమానికి దూరంగా ఉండాలని కాంగ్రెస్ నిర్ణయించింది.