పాక్ పిచ్చి ప్రేలాపనలు.. బలూచిస్థాన్ దాడులపై భారత్ స్ట్రాంగ్ వార్నింగ్! కొలంబో మ్యాచ్పై శ్రీలంక క్లారిటీ
India Slams Pakistan Over Balochistan Allegations: బలూచిస్థాన్ ప్రావిన్స్లో జరుగుతున్న అశాంతికి భారతే కారణమంటూ పాకిస్థాన్ చేస్తున్న ఆరోపణలను కేంద్ర విదేశాంగ శాఖ తీవ్రంగా తోసిపుచ్చింది.
India Slams Pakistan Over Balochistan Allegations: బలూచిస్థాన్ ప్రావిన్స్లో జరుగుతున్న అశాంతికి భారతే కారణమంటూ పాకిస్థాన్ చేస్తున్న ఆరోపణలను కేంద్ర విదేశాంగ శాఖ తీవ్రంగా తోసిపుచ్చింది. పాక్ తన అంతర్గత వైఫల్యాల నుండి ప్రజల దృష్టిని మళ్లించేందుకు చేస్తున్న పాత నాటకం ఇదని భారత్ ఎద్దేవా చేసింది.
హింసాకాండ నేపథ్యంలో నిందారోపణలు:
ఇటీవల 'బలూచ్ లిబరేషన్ ఆర్మీ' (BLA) బలూచిస్థాన్లోని 14 నగరాల్లో ఏకకాలంలో జరిపిన దాడుల్లో 33 మంది ప్రాణాలు కోల్పోగా, పాక్ సైన్యం 130 మందికి పైగా తీవ్రవాదులను హతమార్చింది. ఈ పరిణామాల నేపథ్యంలో పాక్ అంతర్గత వ్యవహారాల మంత్రి మొహ్సిన్ నఖ్వీ మాట్లాడుతూ ఈ హింస వెనుక భారత్ హస్తం ఉందని ఆరోపించారు.
భారత్ సమాధానం:
పాక్ ఆరోపణలపై భారత విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ స్పందిస్తూ.. "ప్రతిసారి తమ దేశంలో దాడులు జరిగినప్పుడు ఇతరులపై నిందలు వేయడం పాకిస్థాన్కు అలవాటుగా మారింది. ఆరోపణలు మానేసి, బలూచిస్థాన్ ప్రజల చిరకాల డిమాండ్లను పరిష్కరించడంపై పాక్ దృష్టి పెడితే మంచిది" అని హితవు పలికారు. అక్కడ జరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘనల గురించి ప్రపంచం మొత్తానికి తెలుసని ఆయన విమర్శించారు.
భారత్-పాక్ మ్యాచ్కు శ్రీలంక భరోసా:
మరోవైపు, టీ20 వరల్డ్ కప్ వేదికలపై నడుస్తున్న వివాదంపై శ్రీలంక క్రికెట్ బోర్డు కీలక వ్యాఖ్యలు చేసింది. ఫిబ్రవరి 15న కొలంబోలో జరగాల్సిన భారత్-పాక్ హై-వోల్టేజ్ మ్యాచ్కు అత్యున్నత స్థాయి భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చింది. భారత్, పాక్, బంగ్లాదేశ్ మూడు తమకు మిత్ర దేశాలేనని, తాము ఎవరికీ వ్యతిరేకం కాదని శ్రీలంక స్పష్టం చేసింది.