ఢిల్లీలో అదృశ్యమైన ఇద్దరు డాక్టర్ల ఆచూకీ లభ్యమైంది. సిక్కింలో డాక్టర్ల ఆచూకీని పోలీసులు కనుగొన్నారు. డాక్టర్ దిలీప్ సామాజిక మాద్యమాన్ని ఉపయోగించడంతో వారు ఉన్న ప్రాంతాన్ని గుర్తించారు. కుటుంబ సభ్యుల సమక్షంలో కౌన్సిలింగ్ నిర్వహించిన పోలీసులు అనంతరం వారితో పంపనున్నారు. డిసెంబర్ 25న ఢిల్లీలో ఇద్దరు తెలుగు డాక్టర్లు అదృశ్యమయ్యారు.
శ్రీధర్, దిలీప్, హిమబిందు ముగ్గురు ఎంబీబీఎస్లో క్లాస్మేట్స్. అలాగే ఆత్మీయ మిత్రులు. శ్రీధర్ అతని భార్య హిమబిందు ప్రస్తుతం ఢిల్లీలో వైద్యులుగా పనిచేస్తున్నారు. దిలీప్ ఛండీగఢ్లో ఉంటున్నాడు. ఫ్యామిలీ ఫ్రెండ్ అయిన దిలీప్ను ట్రైన్ ఎక్కించేందుకు హిమబిందు డిసెంబర్ 25న రైల్వేస్టేషన్కు వెళ్లింది. అప్పటి నుంచి వారిద్దరూ కనిపించకుండా పోయారు. ఫోన్లు స్విచ్ఛాఫ్ వస్తుండటంతో కంగారుపడిన శ్రీధర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. చంఢీగడ్లో ఉంటున్న దిలీప్ భార్య దివ్య భర్త ఆచూకీ తెలియకపోవడంతో అక్కడి నుంచి ఢిల్లీ చేరుకుంది.
శ్రీధర్ ఫిర్యాదుతో దర్యాప్తు చేపట్టిన పోలీసులకు వారి గురించి ఎలాంటి ఆధారాలు లభించలేదు. రెండు ఫోన్లు సిచ్ఛాఫ్ రావడం.. వారిద్దరు రోడ్డుపై నడుస్తున్న ఓ వీడియో మాత్రమే లభించడంతో కేసు దర్యాప్తు కష్టంగా మారింది. ఈ క్రమంలోనే ఎన్నో అనుమానాలు తలెత్తాయి. చివరికి సోషల్మీడియా సాయంతో వారిద్దరు సిక్కింలో ఉన్నట్లు గుర్తించి బుధవారం అదుపులోకి తీసుకున్నారు. ఈ రోజు వారిద్దరిని విచారించిన తర్వాత స్వస్థలాలకు పంపించనున్నట్లు తెలుస్తోంది.