అడవి జంతువుల కోసం విషం పెడితే..ఆవులు మృతి చెందాయి!
అవి నోరు లేని జంతువులు... అవి ఏమి చేసినా చాలా వరకు మనకు ప్రయోజనాన్నే చేస్తుంటాయి.
అవి నోరు లేని జంతువులు... అవి ఏమి చేసినా చాలా వరకు మనకు ప్రయోజనాన్నే చేస్తుంటాయి.అటువంటి వాటిని విషమిచ్చి చంపడానికి చేతులెలా వస్తున్నాయో అర్థం కావడం లేదు. మొన్న ఏనుగుకు విషమిచ్చారు... నిన్న కోతుల్ని చంపారు... నేడు ఆవులకు విషమిచ్చారు... ఇలా చెప్పుకుంటూ పోతే ఒక్కటేమిటి... చాలా వరకు ఉంటాయి. ఇవే కాదు.. ఇంకా వెలుగులోకి రానివి మరెన్నో... ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నా వీటిని నిలువరించలేకపోవడం విశేషం.
కేరళలో ఏనుగు దారుణ మరణాన్ని మరవకముందే దేశంలో మరికొన్ని అమానుష ఘటనలు బయటపడుతున్నాయి. అసోంలో కాఛార్ జిల్లాలోని ఓ రిజర్వాయర్లో దాదాపు 13 కోతుల మృతదేహాలు లభ్యమవడం కలకలం రేపింది. నీటిని కలుషితం చేయడానికి మూగ జీవాలను బలిచేశారని స్థానికులు ఆరోపిస్తున్నారు. తాజాగా ఇలాంటిదే మరో ఘటన కర్ణాటక రాష్ట్రంలో వెలుగు చూసింది. చిక్కమగళూరులో ఓ వ్యక్తి పొలంలోకి అడవి జంతువులు ప్రవేశించకుండా విషం పూసిన పనస పళ్లను పెడితే.. వాటిని తిని మూడు ఆవులు మృత్యువాతపడ్డాయని సమాచారం.
చిక్కమగళూరు జిల్లా బాసవరళ్లి గ్రామానికి చెందిన కొట్టె గౌడ, మధు అనే వ్యక్తులకు చెందిన మూడు ఆవులు విషంతో నిండిన పనసపళ్లు తిని మరణించాయి. పొలంలోకి అడవి జంతువులు చొరబడకుండా ఆపడం కోసమే ఈ దారుణానికి ఒడిగట్టినట్టు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.