ఇస్రో కేంద్రంపై తిరుగాడిన విమానాలు.. ఎవరివి?

Update: 2019-07-29 06:52 GMT

తమిళనాడులోని తిరునెల్వేలి జిల్లా మహేంద్ర గిరిలోని ఇస్రో కేంద్రంపై శనివారం రెండు అనుమానిత విమానాలు చక్కర్లు కొట్టాయి. ఈ విషయం ఇప్పుడు చర్చనీయాంశం అయింది. అసలు ఆ విమానాలేవరివనే చర్చ సాగుతోంది. మరోవైపు పోలీసులు ఈ విషయంలో దర్యాప్తు ముమ్మరం చేశారు.

ఇస్రోకు చెందిన ప్రొపుల్షన్‌ కాంప్లెక్స్‌ తమిళనాడులోని తిరునెల్వేలి జిల్లా మహేంద్రగిరిలో ఉంది. ఉపగ్రహ ప్రయోగాలకు అవసరమైన జీఎస్‌ఎల్వీ రాకెట్ ఇంజిన్లు, విడిభాగాలను ఇక్కడే తయారు చేస్తున్నారు. కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం (సీఆర్‌పీఎఫ్‌) రక్షణ వలయంలోని ఈ కేంద్రంపై శనివారం తెల్లవారుజామున రెండు అనుమానిత విమానాలు తిరిగినట్లు విధుల్లో ఉన్న సీఆర్‌పీఎఫ్‌ సిబ్బంది స్థానిక అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అక్కడి అధికారులు వెంటనే దిల్లీలోని ఉన్నతాధికారులకు ఈ విషయాన్ని తెలియపరిచారు. వారి సూచన మేరకు పణకుడి పోలీసులకు సీఆర్‌పీఎఫ్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ రవీంద్రన్‌ ఫిర్యాదు చేశారు. పోలీసులు ఈ ఘటనపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి విచారణ చేపట్టారు. 2015లో మానవ రహిత విమానం ఒకటి ఇదే రీతిగా వెళ్లింది. మళ్లీ 2017 ఆగస్టు 24, సెప్టెంబరు 25 తేదీల్లోనూ అనుమానిత విమానాలు ఇదే విధంగా తిరగడం గమనార్హం. 

Tags:    

Similar News