Supreme Court: గంగా నదిలో మృతదేహాల ఘటనపై సుప్రీం కీలక వ్యాఖ్యలు

Supreme Court: గంగానదిలో పదుల కొద్దీ మృతదేహాలు కొట్టికొచ్చిన అంశంపై సుప్రీం కోర్టు సోమవారం తీవ్ర వ్యాఖ్యలు చేసింది.

Update: 2021-06-29 01:11 GMT

Supreme Court

Supreme Court: బీహార్, యూపీలో గంగా పరివాహక ప్రాంతాల్లో పదుల కొద్దీ మృతదేహాలు కొట్టికొచ్చిన అంశంపై సుప్రీం కోర్టు సోమవారం తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఇది 'చాలా తీవ్రమైన సమస్య' అంటూ విచారణ సందర్భంగా వ్యాఖ్యానించింది. చనిపోయినవారి హక్కులను పరిరక్షించడానికి విధానాలను రూపొందించాలని కోరుతూ దాఖలైన వ్యాజ్యంపై జస్టిస్ ఎల్ నాగేశ్వరరావు, జస్టిస్ హేమంత్ గుప్తాల ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ విషయంలో ఇప్పటికే మార్గదర్శకాలు జారీచేశామని, జాతీయ మానవహక్కుల కమిషన్‌ను ఆశ్రయించాలని పిటిషనర్‌కు సూచించింది. 'జాతీయ మానవ హక్కుల కమిషన్ వద్దకు వెళ్లండి.. మీరు ఎన్ని ఫోరమ్‌లను సంప్రదించవచ్చు? ఇది తీవ్రమైన సమస్య అని మాకు తెలుసు. అదృష్టవశాత్తూ పరిస్థితి ఇప్పుడు అలా లేదు. మీరు ఎన్‌హెచ్ఆర్సీ సిఫార్సులను ప్రస్తావించారు ...కాబట్టి అక్కడికి వెళ్లండి' అని పేర్కొంది.

చనిపోయిన వారికి గౌరవంగా సాగనంపి, వారికి హక్కుల పరిరక్షణకు విధానాలపై రూపకల్పనకు మార్గదర్శకాలను గత నెలలో సుప్రీంకోర్టు వెల్లడించింది. తాజాగా, డిస్ట్రస్ మేనేజ్‌మెంట్ కలెక్టివ్ అనే స్వచ్ఛంద సంస్థ దీనిపై వ్యాజ్యం దాఖలు చేసింది. పవిత్ర గంగానదిలో మృతదేహాలను పడేయటం సమాజానికి సిగ్గుచేటు.. ఇది మృతిచెందిన వ్యక్తుల మానవహక్కుల ఉల్లంఘనే ' అని జాతీయ మానవహక్కుల కమిషన్ ఘాటు వ్యాఖ్యలు చేసింది.

బిహార్, యూపీలో గంగా పరివాహక ప్రాంతాల్లో పలు మృతదేహాలు బయటపడ్డాయి. ఇసుకలో ఖననం చేసిన మృతదేహాలు పెద్ద సంఖ్యలో బయటపడిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరలయ్యాయి. కరోనా కారణంగా శవాలను కాల్చడానికి స్థలం, కట్టెలు దొరకపోవడంతో నదిలో వదిలేశారని, అధికారులు కూడా ఎటువంటి ఏర్పాట్లు చేయడంలేదని ఆరోపణలు వచ్చాయి.

Tags:    

Similar News