Corona: ఏప్రిల్‌ రెండో వారం నుంచి పీక్స్ కు సెకండ్ వేవ్

Corona: విజృంభణ ఏప్రిల్‌ నెల రెండో వారం తర్వాత గరిష్ఠ స్థాయికి చేరుకుంటుందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు

Update: 2021-04-03 02:16 GMT

Second వేవ్:(ఫైల్ ఇమేజ్) 

Second wave: దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభణతో రికార్డు స్థాయిలో పాజిటివ్‌ కేసులు బయటపడుతున్నాయి. ఒక్క రోజే 82 వేలకు చేరువలో కొత్త కేసులు వెలుగు చూడటం వైరస్‌ తీవ్రతకు అద్దం పడుతోంది. దేశంలో సెకండ్‌ వేవ్‌ మార్చి నెలలో ప్రారంభమైనట్లు గుర్తించగా.. ఈ విజృంభణ ఏప్రిల్‌ నెల రెండో వారం తర్వాత గరిష్ఠ స్థాయికి చేరుకుంటుందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. అలా కొనసాగుతూ మే చివరి నాటికి వైరస్‌ తీవ్రత తగ్గే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

దేశంలో కరోనా తొలి దశ ఉద్ధృతి కొనసాగిన సమయంలో వైరస్‌ తీవ్రతను సూత్రా అనే గణాంక పద్ధతి ద్వారా కాన్పూర్‌ ఐఐటీ శాస్త్రవేత్తలు అంచనా వేశారు. 2020 సెప్టెంబర్‌ నెలలో వైరస్‌ తీవ్రత గరిష్ఠానికి చేరుకొని.. 2021 ఫిబ్రవరి నాటికి తగ్గిపోతుందని శాస్త్రవేత్తలు అంచనా వేశారు. అదే తరహాలో ప్రస్తుతం రెండో దశ కొవిడ్‌ ఉద్ధృతిని కూడా అంచనా వేస్తున్నారు.

'ప్రస్తుతం దేశంలో పెరుగుతోన్న కరోనా కేసుల తీరును చూస్తే ఏప్రిల్ 15-20వ తేదీ మధ్యకాలంలో గరిష్ఠానికి చేరుకునే అవకాశం ఉంది. అదే తీరుతో కాస్త తగ్గుముఖం పడుతూ.. మే చివరి నాటికి గణనీయంగా తగ్గుతుంది' అని అధ్యయనంలో పాల్గొన్న ఐఐటీ కాన్పూర్‌ శాస్త్రవేత్త మనీంద్రా అగర్వాల్‌ పేర్నొన్నారు. ఇప్పటికే రోజువారీ కేసుల సంఖ్య లక్షకు చేరువయ్యిందని.. రానున్న రోజుల్లో ఇది మరింత పెరిగి.. చివరకు తగ్గుముఖం పడుతుందన్నారు. ఇప్పుడున్న తీవ్రతను బట్టి చూస్తే మహారాష్ట్ర, ఆ తర్వాత పంజాబ్‌ రాష్ట్రాలు గరిష్ఠ స్థాయికి చేరుకుంటాయని అంచనా వేశారు. రాష్ట్రాల వారీగా కేసుల్లో తేడా ఉన్నప్పటికీ ఏప్రిల్‌ రెండో వారం నాటికి వైరస్‌ ఉద్ధృతి గరిష్ఠానికి చేరుకునే అవకాశాలున్నాయని తెలిపారు.

Tags:    

Similar News