కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ చిక్కుల్లో పడ్డారు. 'ప్రధాని మోదీ దొంగ అని సుప్రీంకోర్టే చెప్పింది' అన్న వ్యాఖ్యలపై ఆయనకు నోటీసులు జారీచేసింది సర్వోన్నత న్యాయస్థానం.పైగా రఫేల్ తీర్పునకు రాహుల్ తప్పుడు ఆరోపణల్ని ఆపాదించారని అందులో పేర్కొంది. ఈ వ్యాఖ్యలకు ఏప్రిల్ 22లోపు వివరణ ఇవ్వాలని సుప్రీం కోర్టు రాహుల్ గాంధీని ఆదేశించింది. కాగా ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో జరిగిన రఫేల్ ఒప్పందంపై లీకైన పత్రాల ఆధారంగా గతంలో ఇచ్చిన తీర్పును పునఃసమీక్షించేందుకు సుప్రీం ఈ నెల 10న అంగీకరించగా..
అదేరోజు అమేథీలో నామినేషన్ దాఖలుచేసిన అనంతరం రాహుల్ గాంధీ దీనిపై మాట్లాడుతూ..'చౌకీదార్(కాపలాదారు–మోదీ) దొంగ అని సుప్రీంకోర్టు చెప్పింది. మోదీ దొంగతనానికి పాల్పడ్డారని కోర్టు స్పష్టం చేసింది. ఈ సందర్భంగా నేను సుప్రీంకోర్టుకు ధన్యవాదాలు చెబుతున్నా. సత్యమే గెలిచింది' అని వ్యాఖ్యానించారు. దీంతో రాహుల్ వ్యాఖ్యలపై తీవ్రంగా మండిపడ్డ బీజేపీ ఎంపీ మీనాక్షి లేఖీ కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేశారు. ప్రధానికి లేనిపోని ఆరోపణలు ఆపాదించారని ఆమె తన పిటిషన్ లో పేర్కొన్నారు.