Indian Railaways: యూపీలోని ప్రయాగ్ రాజ్ లో కొనసాగుతున్న కుంభమేళాకు భారీ సంఖ్యలు భక్తులు హాజరవుతున్నారు. వారాంతం కావడంతో భక్తుల రద్దీ విపరీతంగా కొనసాగుతోంది. కుంభమేళాకు వెళ్లేదారులన్నీ వాహనాలతో బారులు తీరాయి. అటు రైల్వే స్టేషన్లూ కిక్కిరిసిపోతున్నాయి. ఢిల్లీ తొక్కిసలాటలో 18 మంది ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో అప్రమత్తమైన రైల్వేశాఖ రద్దీని నియంత్రించేందుకు చర్యలు చేపట్టింది. రైళ్ల రాకపోకలకు సంబంధించి రైల్వే రక్షణ దళం లౌడ్ స్పీకర్లతో ప్రకటనలు, స్టేషన్ సమీపంలో వాహనాలను నియంత్రించడంతోపాటు ఆర్పీఎఫ్ ఉన్నతాధికారులు భద్రతను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు.
మహాకుంభమేళాకు భారీగా భక్తులు తరలివస్తుండటంతో యూపీ రహదారులు, రైల్వే స్టేషన్లు కిక్కిరిసిపోతున్నాయి. దీంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసేందుకు ఆయా ప్రదేశాల్లో సాధారణ పోలీసులతోపాటు జీఆర్పీ, ఆర్పీఎఫ్ బలగాలను భారీ సంఖ్యలో మోహరించారు. ఢిల్లీ తొక్కిసలాట నేపథ్యంలో న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ తోపాటు యూపీలోని ప్రయాగ్ రాజ్, వారణాసి, అయోధ్య, కాన్పూర్, లఖ్ నవూతోపాటు మిర్జాపూర్ రైల్వేస్టేషన్లలో కఠిన నిబంధనలు అమలు చేస్తున్నారు.
రైల్వే ఫ్లాట్ ఫామ్ మీదకు వచ్చేవరకు ప్రయాణికులను అనుమతించడం లేదు. స్టేషన్ బయటే రద్దీ నియంత్రిస్తున్నారు. స్టేషన్ సమీప ప్రాంతాల్లోనూ వాహనాలను అనుమతించడం లేదు. కీలక ప్రదేశాల్లో బారికెడ్లను పెట్టి రద్దీని నిలువరిస్తున్నారు. రైలు వచ్చే ఫ్లాట్ ఫామ్ కు సంబంధించి ఏవైనా మార్పులు ఉన్నట్లయితే 90 నిమిషాల ముందే ప్రకటిస్తామని అధికారులు పేర్కొంటున్నారు.
అయోధ్య రైల్వే స్టేషన్ కు నిత్యం సుమారు లక్షన్నర ప్రయాణికులు వస్తున్నట్లు అంచనా వేస్తున్నారు. వీరి కోసం ప్రత్యేక ప్రవేశ నిష్క్రమరణ దారులను ఏర్పాటు చేస్తున్నారు. న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ లోనూ కీలక చర్యలు తీసుకున్నారు. ప్రయాగ్ రాజ్ కు వెళ్లే ప్రత్యేక రైళ్లన్నీ ఫ్లాట్ ఫామ్ నెంబర్ 16 నుంచే బయలుదేరుతాయని ప్రకటించారు. రెగ్యులర్ రైళ్లన్నీ ఎప్పటి మాదిరిగానే ఆయా ఫ్లాట్ ఫామ్స్ నుంచి రాకపోకలు సాగిస్తాయని తెలిపారు.
ప్రయాణికులు ఎలాంటి వదంతులు నమ్మకూడదని..ఏదైనా సమాచారం కావాలంటే హెల్ప్ లైన్ నెంబర్ 139కు ఫోన్ చేయాలని సూచించారు. ఆదివారం ఒక్కరోజే సాయంత్రం 6గంటల వరకు 1.36కోట్ల మంది ప్రయాగ్ రాజ్ కు వచ్చినట్లు యూపీ ప్రభుత్వం తెలిపింది. దీంతో ఇప్పటి వరకు 52.83కోట్ల మంది కుంభమేళాలో పుణ్యస్నానాలు ఆచరించినట్లు తెలిపింది.