దేశంలో కరోనా విజృంభణ నేపథ్యంలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ నివాసంలో కేంద్ర మంత్రుల బృందం భేటీ అయింది. ఈ సమావేశంలో కరోనా నియంత్రణ చర్యలు, లాక్డౌన్ మినహాయింపు రోజుల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చలు జరుపుతున్నారు. కోవిడ్-19 సంక్షోభం నేపథ్యంలో కేంద్ర, రాష్ట్రాల మధ్య సమన్వయంపై మంత్రులు సమావేశంలో చర్చిస్తున్నారు.
అదేవిధంగా మే 3వ తేదీన లాక్డౌన్ ఎత్తివేత అనంతరం ఏ విధంగా ముందుకు వెళ్లాలన్నదానిపై భేటీలో నేతలు చర్చిస్తున్నారు. సమాచార, ప్రసారశాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్, టెక్స్టైల్ మంత్రి స్మృతి ఇరానీ, పెట్రోలియంశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, రామ్ విలాస్ పాశ్వన్, గిరిరాజ్ సింగ్, సంతోష్ గాంగ్వర్, రమేశ్ పోక్రియాల్, పియూష్ గోయల్ సమావేశానికి హాజరయ్యారు. ఈ మంత్రుల బృందం (జీవోఎం) కోవిడ్ - 19, లాక్డౌన్పై సమావేశమై చర్చించడం ఇది ఐదోసారి.