Rajasthan Political Crisis Updates: సచిన్ పైలట్ కు ఊరట..! పిటిషన్‌ను వెనక్కితీసుకున్న‌ అసెంబ్లీ స్పీకర్‌

Update: 2020-07-27 08:22 GMT

Rajasthan Political Crisis Updates: రాజస్థాన్ మాజీ ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్ నేతృత్వంలోని 18 మంది కాంగ్రెస్ శాసనసభ్యులపై అనర్హత చర్యలను వాయిదా వేయాలని కోరుతూ.. హైకోర్టు జూలై 21 న ఇచ్చిన ఉత్తర్వుల ను సవాలు చేస్తూ రాజస్థాన్ అసెంబ్లీ స్పీకర్ సిపి జోషి సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. అయితే తాజాగా కీలక పరిణామం చోటుచేసుకుంది. సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ను రాజస్తాన్‌ అసెంబ్లీ స్పీకర్‌ సీపీ జోషీ సోమవారం ఉపసంహరించుకున్నారు. సుప్రీంకోర్టు లేవనెత్తిన న్యాయపరమైన అంశాలన్నింటినీ ప్రస్తావించడంతో ఈ పిటిషన్‌ను ఉపసంహరించేందుకు అనుమతించాలని జస్టిస్‌ అరుణ్‌ మిశ్రా నేతృత్వంలోని త్రిసభ్య బెంచ్‌ను స్పీకర్‌ సీపీ జోషీ కోరారు. దీంతో పిటిషన్‌ ఉపసంహరణకు అనుమతించేందుకు జస్టిస్‌ అరుణ్‌ మిశ్రా, జస్టిస్‌ కృష్ణ మురారి, జస్టిస్‌ బీఆర్‌ గవాయ్ ధర్మాసనం అంగీకరించింది.

దీంతో హైకోర్టు ఇచ్చిన తీర్పే యధాస్థితిగా కొనసాగనుందని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ఇది సచిన్ పైలట్ వర్గానికి భారీ ఊరటను కలిగిస్తుందని అంటున్నారు. మరోవైపు రాజస్తాన్‌ అసెంబ్లీ సమావేశాలను జూలై 31 నుంచి ప్రారంభించాల్సిందిగా కోరుతూ ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లాట్ కేబినెట్‌.. గవర్నర్‌ కల్‌రాజ్‌ మిశ్రాకు పంపిన ప్రతిపాదనను గవర్నర్‌ తిరస్కరించారు. ప్రస్తుతం కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాల నిర్వహణ సాధ్యం కాదని గవర్నర్ పేర్కొన్నట్టు సమాచారం. దీంతో కాంగ్రెస్ పార్టీ గవర్నర్ వ్యవహారశైలిపట్ల తీవ్ర అభ్యంతరం తెలిపారు.  

Tags:    

Similar News