లాక్డౌన్ పొడిగింపుపై కీలక నిర్ణయం తీసుకుంది రాజస్థాన్ ప్రభుత్వం. ఈ నెల 14 వరకు ఉన్న లాక్డౌన్ ను మరికొన్ని రోజుల పాటు పొడిగించాలని నిర్ణయించింది. ఈ మేరకు ఏప్రిల్ 30 వరకు రాష్ట్రంలో లాక్డౌన్ అమలు చేస్తున్నట్టు వెల్లడించింది. ఆ రాష్ట్రంలో ప్రస్తుతం వైరస్ తీవ్రత ఎక్కువగా ఉంది. తాజాగా నమోదైన 98 పాజిటివ్ కేసులు కలిపి మొత్తంగా కరోనా కేసుల సంఖ్య 561కి చేరింది.
ఇక ఈ వైరస్ కారణంగా ఇప్పటికే ఎనిమిది మంది మృతి చెందినట్లు రాష్ట్ర అధికారులు వెల్లడించారు. వైరస్ను కట్టడి చేయాలంటే లాక్ డౌన్ కొనసాగించాలని అశోక్ గెహ్లాట్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఇదిలా ఉంటే ఇప్పటికే పంజాబ్ సీఎం అమరిందర్ సింగ్ లాక్ డౌన్ను మే 1 వరకు పొడిగించిన సంగతి తెలిసిందే. అలాగే ఒడిశా కూడా ఈ నెల చివరి వరకు లాక్ డౌన్ను అమలు చేయనుంది.