Rahul Gandhi: మరో యాత్రకు రెడీ అవుతోన్న రాహుల్గాంధీ
Rahul Gandhi: భారత్ జోడో న్యాయయాత్ర పేరిట పాదయాత్రకు సిద్ధం
Rahul Gandhi: మరో యాత్రకు రెడీ అవుతోన్న రాహుల్గాంధీ
Rahul Gandhi: సార్వత్రిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ మరో యాత్రకు సిద్ధమైంది. భారత్ జోడో యాత్ర ఫలితంతో ఫుల్ జోష్ మీదున్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మరో యాత్రకు సిద్ధమవుతున్నారు. భారత్ జోడో యాత్ర తరహాలో కొత్తగా మరో యాత్ర చేపట్టనున్నారు. దీనికి మొదటగా భారత్ న్యాయ్ యాత్ర అని పెట్టిన కాంగ్రెస్.. ఇప్పుడు స్వల్ప మార్పు చేసింది. రాహుల్ గాంధీ నేతృత్వం వహించే ఈ యాత్రకు భారత్ జోడో న్యాయ్ యాత్ర అని నామకరణం చేశారు.
లోక్సభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ యాత్ర చేపట్టబోతున్నారు. మణిపూర్లో జనవరి 14న ప్రారంభమయ్యే యాత్ర మార్చి 20వ తేదీన ముంబైలో ముగుస్తుంది. రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ యాత్ర కింద 66 రోజుల్లో.. 6 వేల 713 కిలోమీటర్ల ప్రయాణం చేస్తారు. ఈ యాత్ర 15 రాష్ట్రాల్లోని 110 జిల్లాల గుండా సాగుతుంది. దాదాపు 100 లోక్సభ స్థానాల్లో చేపట్టే ఈ యాత్రలో అన్ని వర్గాల ప్రజలతో రాహుల్ గాంధీ సమావేశంకానున్నారు.
మణిపూర్ రాజధాని ఇంఫాల్లో ప్రారంభమయ్యే ఈ యాత్ర.. అరుణాచల్ప్రదేశ్, నాగాలాండ్, అస్సాం, మేఘాలయ మీదుగా కొనసాగుతుంది. అనంతరం పశ్చిమబెంగాల్, బీహార్, జార్ఖండ్, ఒడిశా, ఛత్తీస్గఢ్ వరకు కొనసాగి.. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్రలో ముగియనుంది. ఉత్తరప్రదేశ్లోనే అత్యధికంగా 20 జిల్లాల్లో పాదయాత్ర కొనసాగనుంది. దాదాపు ఒక వెయ్యి 74 కిలోమీటర్ల మేర రాహుల్ పాదయాత్ర యూపీలోనే కొనసాగనుంది.
అయితే తొలి దశలో జరిగిన భారత్ జోడో యాత్ర పూర్తిగా పాదయాత్ర కాగా.. న్యాయ్ యాత్ర మాత్రం ఎక్కువగా బస్సుల్లో సాగుతుందని పార్టీ వర్గాలు తెలిపాయి. అక్కడక్కడా యాత్ర ఉంటుందని తెలిపారు. పట్టణ ప్రాంతాల్లో రాహుల్గాంధీ రోజుకు 9 నుంచి 10 కిలోమీటర్ల దూరం పాదయాత్ర చేస్తారు. ఇందులో భాగంగా అక్కడక్కడ బహిరంగ సభలు కూడా ఉండే అవకాశం ఉంది. ఈ సభలకు ఇండియా కూటమి పార్టీలతో పాటు.. ఆయా రాష్ట్రాలోని ఇతర పార్టీలు, సామాజిక సంస్థలు, పౌర సమాజాలను ఆహ్వానిస్తున్నారు. మొత్తం 110 జిల్లాల్లో 100 లోక్సభ, 337 అసెంబ్లీ స్థానాలను ఈ యాత్ర కవర్ చేయనుంది.