వలకు చిక్కిన రాకెట్ బూస్టర్
సముద్రంలోకి వేటకు వెళ్లిన జాలర్లకు చేపలు, తిమింగళాలు చిక్కడం సహజం.
సముద్రంలోకి వేటకు వెళ్లిన జాలర్లకు చేపలు, తిమింగళాలు చిక్కడం సహజం. కానీ చేపల వేటకోసం సముద్రంలోకి వెళ్లిన ఈ తమిళ జాలర్లకు ఒక రాకెట్ కు సంబంధించిన బూస్టర్ లభించింది. ఈ బూస్టర్ బరువు దాదాపుగా 16 టన్నుల వరకూ ఉంటుంది.
పూర్తివివరాల్లోకెళితే తమిళనాడులోని పుదుచ్చేరిలోని వంబాకీరపాళెయానికి చెందిన కొందరు జాలర్లు సముద్రంలో చేపల వేటకు వెళ్లారు. తీరం నుంచి సుమారు 10 నాటికల్ మైళ్ల దూరంలో జాలర్లు వలను విసిరారు. దీంతో ఆ వలకి నవంబరు 27న ప్రయోగించిన కార్టోశాట్ ఉపగ్రహానికి సంబంధించిన బూస్టర్ చిక్కింది.
ఈ బూస్టర్ ఎత్తు బరువును చూసుకుంటే 13.5 మీటర్ల పొడవు, మీటరు వెడల్పు కలిగి 16 టన్నుల బరువును కలిగుంది. ఇంత బరువుగా ఉన్న బూస్టర్ ను జాలర్లు 4 పడవలకు కట్టి తీరానికి తీసుకొచ్చారు. ఈ బూస్టర్ పై ఎఫ్ఎల్ 119, పీఎస్ఎంవో-ఎక్స్ఎల్, 23.2.2019 అని రాసి ఉంది. తీరానికి చేర్చిన బూస్టర్ను జాలర్లు వంబాకీరపాళెయం లైట్ హౌస్ వద్ద భద్రపరిచారు. అనంతరం శ్రీహరికోటలోని షార్ కేంద్రం అధికారులకు సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న నలుగురు అధికారులు పుదుచ్చేరికి చేరుకున్నారు. రాకెట్ బూస్టర్ బరువు, పరిమాణం ఎక్కువగా ఉండడంతో దాన్ని షార్ కేంద్రానికి తరలించడానికి 16 చక్రాల లారీ రప్పించారు. దాన్ని లారిపైకి ఎక్కించడానికి భారీ క్రేన్ను కూడా తెప్పించారు.
అయితే ఈ బూస్టర్ కారణంగా జాలర్లకు చెందిన నాలుగు వలలు పాడయ్యాయని, దీంతో 30 మంది తమ జీవనాధారాన్ని కోల్పోయారని జాలర్లు ఆవేదన వ్యక్తం చేశారు. నష్టపరిహారంగా రూ.20 లక్షల చెల్లించాలని వారిని డిమాండ్ చేశారు. నష్టపరిహారం చెల్లించేంత వరకు బూస్టర్ను అక్కడ నుండి కదలనివ్వమని జాలర్లు ఎదురు తిరిగారు. దీంతో పోలీసులు, తీర భద్రతాదళం అధికారులు అక్కడికి చేరుకుని మత్స్యకారులతో చర్చలు జరిపి రాకెట్ బూస్టర్ను అక్కడ నుంచి తరలించారు.