''చంద్రయాన్-2 విజయం యువకుల్లో, పిల్లల్లో స్ఫూర్తి నింపుతుందని ఆకాంక్షిస్తున్నాను. సెప్టెంబరులో చంద్రుణిపై ల్యాండర్ విక్రమ్, రోవర్ ప్రజ్ఞాన్ కాలుమోపే సమయం కోసం వేచి చూస్తున్నాం. అనేక అవాంతరాలను ఎదుర్కొని ప్రాజెక్టు విజయం కోసం నిరంతరం శ్రమించిన శాస్త్రవేత్తల కృషి, తెగువ ప్రశంసనీయం.'' అంటూ ప్రధాని నరేంద్ర మోడీ తన ''మన్ కీ బాత్'' ప్రజలతో పంచుకున్నారు. ప్రతినెలా చివరి ఆదివారం తన మనసులోని మాటల్ని 'మన్ కీ బాత్' పేరిట మోడీ ప్రజలతో పంచుకుంటున్న విషయం తెలిసిందే. ఈరోజు జూలై చివరి ఆదివారం కావడంతో ఆయన తన మనసులో మాటను అందరికీ వినిపించారు. ఈ స్సందర్భంగా నీటి ప్రాముఖ్యతను మరోసారి ఆయన వివరించారు. ''జల సంరక్షణ కోసం దేశవ్యాప్తంగా అనేక కార్యక్రమాలను చేపట్టారు. ఈ క్రమంలో అనేక సాంప్రదాయ పద్ధతులు తెరపైకి వచ్చాయి. మీడియా వినూత్న పద్ధతులతో ప్రజల్లో అవగాహన తీసుకువచ్చే ప్రయత్నం చేసింది. స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వాలు యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాయి.'' అని అయన చెప్పారు.
ఇస్రో విజయాలపై ఆయన మాట్లాడుతూ ''2019 అనేక అంతరిక్ష విజయాలకు వేదికగా నిలిచింది. మార్చిలో ఏశాట్ ప్రయోగం, తాజాగా చంద్రయాన్-2 ఎంతో కీలకమైనవి. ఎన్నికల కారణంగా ఏశాట్ ప్రయోగంపై పెద్దగా చర్చ జరగలేదు.'' అని వివరించారు. ఇంకా అయన ఈ కార్యక్రమంలో మిస్టర్ సైనీ తన బృందంతో కలిసి లోడీ రోడ్ ప్రాంతాన్ని తన కళా నైపుణ్యంతో ఎంతో సుందరంగా తీర్చిదిద్దారంటూ మోదీ మరోసారి స్వచ్ఛ భారత్ పథకాన్ని ప్రజలకు వివరించే ప్రయత్నం చేశారు. బ్యాక్ టు విలేజ్ ప్రోగ్రాం ద్వారా కశ్మీర్కు చెందిన ఓ యువకుడు చేసిన సూచనను మోదీ ప్రశంసించారు. దీని ద్వారా 'దేశాభివృద్ధిలో కశ్మీర్ ప్రజలు సైతం భాగం కావడానికి సిద్ధంగా ఉన్నార'ని అర్థమవుతోందని పేర్కొన్నారు.