కాంగ్రెస్‌పై పీకే సంచలన వ్యాఖ్యలు.. ఆ పార్టీ ఇప్పట్లో మారదు...

Prashant Kishor: ఓటమి చెందేవరకు యథాతథ స్థితిలో ఉంటదన్న పీకే...

Update: 2022-05-20 11:49 GMT

కాంగ్రెస్‌పై పీకే సంచలన వ్యాఖ్యలు.. ఆ పార్టీ ఇప్పట్లో మారదు...

Prashant Kishor: కాంగ్రెస్‌ పార్టీపై ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిషోర్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌లో ఎలాంటి చింతా లేదు.. ఆ పార్టీ తీరు మారదు.. ఎప్పటిలాగే ఉంటుందని ట్విట్టర్ వేదికగా స్పష్టం చేశారు. కాంగ్రెస్‌ చింతన్‌పై తనదైన శైలిలో విసుర్లు వేశారు. అదొక అదో విఫ‌ల చింత‌న్ శిబిర్ కామెంట్‌ చేశారు. ఉదయ్‌పూర్ వేదిక‌గా జ‌రిగిన కాంగ్రెస్ చింత‌న్ శిబిరంపై త‌న అభిప్రాయాన్ని చెప్పాలంటూ కొంద‌రు ప‌దే ప‌దే కోరడంతోనే తానీ వ్యాఖ్య‌లు చేస్తున్న‌ట్లు పీకే చెప్పారు.

ఈ శిబిరం ద్వారా కాంగ్రెస్‌లో ఎలాంటి మార్పులూ జరగవని తేల్చి చెప్పారు. య‌థాత‌థ స్థితే ఉంటుందంటూ దెప్పిపొడిచారు. ప్ర‌స్తుత నాయ‌క‌త్వానికి కాస్త స‌మ‌యం ఇచ్చారు. రాబోయే గుజ‌రాత్, హిమాచ‌ల్ ప్ర‌దేశ్ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఓట‌మి చెందే వ‌ర‌కూ కాంగ్రెస్‌లో ఈ య‌థాతథ స్థితి కొనసాగుతుందంటూ ప్ర‌శాంత్ కిశోర్ ఘాటు వ్యాఖ్య‌లు చేశారు. చింతన్‌ శిబిర్‌కు ముందు కాంగ్రెస్‌ పార్టీలో ప్రశాంత్‌ కిషోర్ చేరతారంటూ దేశవ్యాప్తంగా చర్చజరగింది. అనేక ఊహాగానాలు, చర్చల తరువాత కాంగ్రెస్‌లో చేరేది లేదంటూ ట్విట్టర్‌ వేదికగా ప్రశాంత్‌ కిషోర్‌ ప్రకటించారు.

తన డిమాండ్లను కాంగ్రెస్‌ అంగీకరించనందునే పీకే కాంగ్రెస్‌లో చేరొద్దని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఆ తరువాత పీకే ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తారని ప్రచారమైంది. దీనిపైనా ప్రశాంత్‌ కిషోర్‌ క్లారిటీ ఇచ్చారు. తాను కొత్త పార్టీని ఏర్పాటు చేయడం లేదని తేల్చి చెప్పారు. అయితే భీహార్‌ ప్రజల కోసం ముందుగా పని చేయాలని నిర్ణయించుకున్నట్టు తెలిపారు. తనతో కలిసి వచ్చేవారితో రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు. అక్టోబరు 2 నుంచి బీహార్‌లో పాదయాత్ర చేయనున్నట్టు ప్రకటించారు.

ఉదయ్​పూర్​లో మూడు రోజుల పాటు జరిగిన పార్టీ మేధోమధన సదస్సు తర్వాత 'కాంగ్రెస్​ది సరికొత్త ఉదయం' అని పార్టీ అధినేత్రి సోనియాగాంధీ స్వయంగా ప్రకటించారు. ప్రజలతో పార్టీకి సంబంధాలు తెగిపోయాయని.. మళ్లీ వారి వద్దకు వెళ్లాలని పార్టీ నిర్ణయించింది. ఒకే కుటుంబానికి ఒకే టికెట్‌ ఇవ్వాలని నిర్ణయించింది. పార్లమెంటరీ బోర్డు ఏర్పాటు చేయాలన్న జీ23 నేతల ప్రతిపానకు ఆమోదం తెలిపింది.

ఈసారి తాము అధికారంలోకి వస్తే.. ఈవీఎంలను బ్యాన్‌ చేసి,.. బ్యాలెట్‌ పద్దతిలోనే ఎన్నికలు నిర్వహించాలన్న ప్రతిపాదనకు కూడా ఓకే చెప్పింది. పార్టీ పదవుల్లో 50 శాతం యువతకు భాగస్వామ్యం కల్పించేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. పార్టీ బలోపేతానికి కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు పాదయాత్ర చేయాలని కీలక నిర్ణయం తీసుకుంది. అయితే 70 ఏళ్లు పైబడిన వారు ఎన్నికల్లో పోటీ చేయరాదన్న ప్రతిపాదనపై మాత్రం చింతన్‌ శిబిర్‌లో ఏకాభిప్రాయం కుదరలేదు. 


Tags:    

Similar News