సీఎంలతో ముగిసిన ప్రధాని వీడియో కాన్ఫరెన్స్.. లాక్ డౌన్ మరో 15 రోజుల పాటు పొడగించే..
దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి, లాక్డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని నరేంద్రమోదీ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ ముగిసింది. ఈ సమావేశం సుమారు మూడు గంటల పాటు సాగింది. లాక్డౌన్ను దశలవారీగా ఎత్తివేసే అంశంపై సీఎంలతో సమీక్షించారు. అయితే ప్రస్తుతం వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో లాక్డౌన్ను కొనసాగించడమే మంచిదని పలు రాష్ట్రాల సీఎంలు ప్రధానిని కోరినట్లు సమాచారం. గ్రీన్ జోన్ ల పరిధిలో అన్ని రకాల ఆర్ధిక కార్యకలాపాలు అనుమతించాలని పలు రాష్ట్రాలు ప్రధానిని కోరాయి. రాష్ట్ర అవసరాలకు సరిపడా వెంటిలేటర్లు సరఫరా చేయాలని రాష్ట్రాలు ప్రధానిని కోరారు.
కరోనా వైరస్ వ్యాప్తి గ్రీన్ జోన్ ల పరిధిలోకి వ్యాప్తి చెందకుండా రాష్ట్రాలు సీరియస్ చర్యలు చేపట్టాలని ప్రధాని తెలిపారు. రెడ్ జోన్, ఆరెంజ్ జోన్ ల నుండి గ్రీన్ జోన్ ల లోకి ఎటువంటి రాకపోకలు జరగకుండా రాష్ట్రాలు చూడాలని రాష్ట్రాల సీఎంలకు ప్రధాని తెలిపారు. మరోవైపు మరో 15 రోజుల పాటు లాక్ డౌన్ పొడగించే ఆలోచనలో కేంద్ర ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం.