ఉల్లిపాయను కోస్తేనే కాదు కొనాలన్నా సామాన్యులకు కంటనీరు తెప్పిస్తోంది. అన్ని వర్గాల ప్రజలు నిత్యం ఆహారంలో భాగంగా వినియోగించే వీటి ధర మార్కెట్లో రూ.50 నుంచి 60 వరకు ఉంటోంది. దేశంలో అత్యధికంగా ఉల్లిని పండించే మహారాష్ట్రలో గత రెండు సీజన్ల నుంచి వాతావరణం అనుకూలంగా లేక సాగు విస్తీర్ణం, దిగుబడి తగ్గాయి. ప్రస్తుత ఖరీఫ్లో అధిక వర్షాల వల్ల పంట దెబ్బతింది. కర్ణాటకలో సాగు బాగున్నా గత నెలరోజుల్లో కురిసిన భారీ వర్షాల కారణంగా దిగుబడి బాగా తగ్గింది. తెలుగు రాష్ట్రాల్లో గత నెలరోజులుగా వర్షాలు పడుతున్నందున ఉల్లిగడ్డ సరిగా పెరగక మార్కెట్లకు సరఫరా తగ్గింది. దీంతో ఉల్లికి డిమాండ్ పెరగడంతో కేజీ ధర 50 నుంచి 60 రూపాయలకు పెరుగుతోంది.