ఆ వాహనాలపై అధికారుల నిఘా!

* వ్యక్తిగత వాహనాల జీవితకాలం 20 ఏళ్లు * వాణిజ్య వాహనాల జీవితకాలం 15 ఏళ్లు

Update: 2021-02-10 10:02 GMT

Representational Image (the Hans India)

రోడ్డు ప్రమాదాలు, పొల్యూషన్‌ తగ్గించడానికి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం కాలం చెల్లిన వాహనాలకు చెక్‌ పెట్టింది. వెహికల్‌ జీవిత కాల పరిమితిని ప్రకటించిన ప్రభుత్వం కాలం చెల్లినవాటిని తుక్కుతుక్కు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ నిర్ణయంపై కొ్ందరు సంతృప్తి వ్యక్తంగా చేయగా మరికొందరు అభ్యంతరం వ్యక్తం చేశారు. కేంద్రం ప్రవేశపెట్టిన వెహికిల్‌ స్క్రాప్‌ పాలసీపై వాహనదారులు ఎలాంటి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

పాత వాహనాలతో కాలుష్యం, ప్రమాదాలు పెరుగుతుండటంతో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కాలం చెల్లిన వాహనాలను స్క్రాప్‌గా మార్చాలని కీలక నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం వ్యక్తిగత వాహనాలకు జీవిత కాలం 20 ఏళ్లుగా, వాణిజ్య వాహనాలకు జీవిత కాలం 15 ఏళ్లుగా నిర్ణయించింది. అయితే కమర్షియల్‌ వెహికల్‌ నడుపుతున్న వాహన దారులు కొత్త వాటిని కొనుగోలు చేయలేని పరిస్థితిలో ఉన్నామని చెబుతున్నారు.

మరోవైపు.. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని కొందరు సమర్థించినా ట్రాఫిక్‌ నియంత్రణపై అధికారుల నిర్లక్ష్యాన్ని తెలియజేశారు. వాహనాల జీవిత కాల పరిమితిని పెంచి వ్యక్తిగత వాహనాలు అమ్మకాలను కొంతమేర తగ్గించాలన్నారు. ఇంట్లో నలుగురు సభ్యులు ఉంటే నాలుగు కార్లు కాకుండా ఒక్క కారు కొనుగోలు చేయాలంటున్నారు. అదేవిధంగా పొల్యూషన్‌ ప్రకారం ఆలోచిస్తే ఢిల్లీ ప్రభుత్వం అమలు చేసిన విధంగా హైదరాబాద్‌లో కూడ సరి, బేసి వాహనాల నిబంధన అమలు చేయాలంటున్నారు.

ఇదిలా ఉంటే కేంద్ర ప్రభుత్వం ఆదేశాల ప్రకారం రవాణా అధికారులు 15, 20 ఏళ్ల వాహనాలపై నిఘా పెంచారు. అటు వాహనదారలు మాత్రం కాలుష్యం, ప్రమాదాలు జరగకుండా ఉండాలంటే ప్రత్యామ్నాయ మార్గాలను కూడా ఆలోచించాలంటున్నారు. మరోవైపు పాత వాహనాలను తుక్కు కింద వాహన డీలర్లకు ఇవ్వటం ద్వారా నూతన వాహనం కొనుగోలుకు కొంత రాయితీ ఇచ్చే విధానం రూపొందించినప్పటికీ దానిపై ఇంకా స్పష్టత రాలేదంటున్నారు వినియోగదారులు.

Tags:    

Similar News