కొత్త మోటారు వాహన చట్టం అమల్లోకి వచ్చిననాటి నుంచి దేశంలో ఎన్నో చిత్రవిచిత్రాలు జరుగుతున్నాయి. కొందరి వాహనదారులకు చలాన్ల రూపంలో మోత మోగుతుంటే మరికొందరికి వింత పెనాల్టీలను చూడాల్సి వస్తుంది. అయితే ఢిల్లీలో అలాంటి విత పెనాల్టీ ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. నోయిడాకు చెందిన ఓ బస్సు డ్రైవర్ హెల్మెట్ పెట్టుకోలేదంటూ పోలీసులు రూ.500 పెనాల్టీ వేశారు. ఈ నెల 11న గౌతమ్ బుద్ధ నగర్ పోలీసులు ఈ చలానా రాసినట్లు బాధితుడు పేర్కొన్నారు.
నోయిడాకు చెందిన నిరాంకార్ సింగ్కు సొంతంగా 40 నుంచి 50 బస్సులు ఉన్నాయి. ప్రైవేటు స్కూళ్లు, కంపెనీలకు తన బస్సులను అద్దెకిచ్చి నడిపిస్తుంటాడు. సెప్టెంబర్ 11వ తేదీన ఆయనకు ఒక చలాన్ వచ్చింది. తన బస్సు నడుపుతున్న డ్రైవర్ హెల్మెట్ పెట్టుకోలేదని, అందుకు రూ.500 చలాన్ చెల్లించాలని ట్రాఫిక్ పోలీసులు నోటిసు పంపారు. దీంతో బిత్తరపోయిన నిరాంకర్ సింగ్ డ్రైవర్ బస్సు నడిపేందుకు హెల్మెట్ ఎందుకు పెట్టుకోవాలంటూ విస్తుపోయారు. ట్రాఫిక్ సిబ్బంది ఒకవేళ పొరపాటున తనకు ఈ చలాన్ పంపించి ఉండొచ్చునని, కానీ, ఒక బస్సు యాజమానికే ఇలాంటి చలాన్ వస్తే పరిస్థితేంటని పలువురు ప్రశ్నిస్తున్నారు.