Nepali Couple: బెంగళూరులో భారీ దోపిడీ.. రూ.18 కోట్లతో ఉడాయించిన నేపాలీ జంట
Nepali Couple: బెంగళూరులో బిల్డర్ ఇంట్లో పనిచేసిన నేపాలీ దంపతులు రూ.18 కోట్ల బంగారం, వెండి, నగదుతో పరారీ. సీసీటీవీ ఆధారంగా పోలీసుల గాలింపు.
Nepali Couple: బెంగళూరులో భారీ దోపిడీ.. రూ.18 కోట్లతో ఉడాయించిన నేపాలీ జంట
Nepali Couple: బెంగళూరులో భారీ దోపిడీ ఘటన సంచలనం సృష్టించింది. ఓ ప్రముఖ బిల్డర్ ఇంట్లో పనిచేస్తున్న నేపాలీ దంపతులు నమ్మకాన్ని ఆసరాగా చేసుకుని సుమారు రూ.18 కోట్ల విలువైన బంగారం, వెండి, నగదుతో పరారైన ఘటన వెలుగులోకి వచ్చింది. పనిలో చేరిన కేవలం 20 రోజులకే పక్కా ప్రణాళికతో ఈ చోరీకి పాల్పడటం పోలీసులను కూడా ఆశ్చర్యానికి గురి చేసింది.
బెంగళూరు యలహంక కెంపురా మెయిన్ రోడ్లో నివసిస్తున్న బిల్డర్ శిమంత్ ఎస్ అర్జున్ ఇంట్లో దినేశ్, కమల అనే నేపాలీ దంపతులు ఇటీవలే ఇంటి పనివారిగా చేరారు. ఆదివారం ఉదయం శిమంత్ కుటుంబ సభ్యులతో కలిసి బంధువుల ఇంటి నిర్మాణానికి సంబంధించిన భూమి పూజకు వెళ్లిన సమయంలో, ఇదే అదనుగా భావించిన నిందితులు ఈ దోపిడీకి పాల్పడ్డారు.
గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న కప్బోర్డును ఇనుప రాడ్తో పగలగొట్టి సుమారు 10 కిలోల బంగారం, వజ్రాభరణాలు అపహరించిన నిందితులు, అనంతరం మొదటి అంతస్తులోని బెడ్రూంలో ఉన్న లాకర్ను తెరిచి 1.5 కిలోల బంగారం, 5 కిలోల వెండి ఆభరణాలు, రూ.11.5 లక్షల నగదు ఎత్తుకెళ్లినట్లు పోలీసులు తెలిపారు. మొత్తం దోపిడీ విలువ సుమారు రూ.18 కోట్లుగా అంచనా వేస్తున్నారు.
మధ్యాహ్నం 12:38 గంటల సమయంలో ఇంట్లోని మరో పనిమనిషి అంబిక ఈ ఘటనను గమనించి వెంటనే యజమానికి సమాచారం అందించారు. దీంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు.
కేవలం 20 రోజుల క్రితమే పనిలో చేరిన దినేశ్, కమల యజమాని కుటుంబ సభ్యుల కదలికలను నిశితంగా గమనించి ఈ దోపిడీకి పాల్పడి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై మారతహళ్లి పోలీసులు BNS సెక్షన్ 306 కింద కేసు నమోదు చేశారు. నిందితులు ఇతర రాష్ట్రాలకు లేదా వారి స్వదేశమైన నేపాల్కు పరారై ఉండవచ్చని భావిస్తూ, సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని పోలీసులు వెల్లడించారు.