Vaccination Centres in Mumbai: ముంబైలో మూడు రోజుల పాటు నో వ్యాక్సిన్
Vaccination Centres in Mumbai: ముంబైలో మూడు రోజులపాటు వ్యాక్సిన్ సెంటర్లను మూసివేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది.
Vaccine Shortage In Mumbai:(File Image)
Vaccination Centres in Mumbai: దేశంలో కరోనా వైరస్ రెండో దశ వ్యాప్తి ప్రమాదకర స్థాయిలో కొనసాగుతోంది. మరో వైపు దేశంలో కరోనా బాధితులు ఆక్సిజన్ దొరక్క విలవిలలాడడం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకుని కొంత ఉపశమనం పొందుదామని అనుకున్నా అదీ దొరకడంలేదు. దేశ వ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో కోవిడ్ వ్యాక్సిన్ సెంటర్లను మూసి వేస్తున్నారు. ఈ విభిన్న పరిస్థితుల్లో కేంద్ర, రాష్ట్ర సంబంధాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది.
వ్యాక్సిన్ కొరత తీవ్రంగా ఉన్న దృష్ట్యా, ముంబైలో మూడు రోజులపాటు వ్యాక్సిన్ సెంటర్లను మూసివేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. శుక్రవారం నుంచి ఆదివారం వరకు వ్యాక్సినేషన్ డ్రైవ్ ఉండబోదని గ్రేటర్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ వెల్లడించింది. 18 నుంచి 45 ఏళ్ళ మధ్య వయస్సువారికి మే 1 నుంచి వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని చేపట్టాలని ప్రభుత్వం ఆదేశించిందని, కానీ టీకామందు కొరత తీవ్రంగా ఉన్నందున ప్రస్తుతానికి 3 రోజులపాటు ఈ డ్రైవ్ ఉండదని అధికారులు తెలిపారు.
వ్యాక్సినేషన్ తేదీలను ఇంకా వాయిదా వేసే అవకాశం ఉందని కూడా వారు చెప్పారు. ఏప్రిల్ 30 నుంచి మే 2 వరకు వ్యాక్సినేషన్ సెంటర్లు మూసి ఉంటాయని ఓ నోటీసులో పేర్కొన్నారు. ఒకవేళ ఈ లోగా టీకామందు వస్తే మీడియా లేదా సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తామని వారు వివరించారు. సీనియర్ సిటిజన్లు, 45 ఏళ్ళు అంతకన్నా వయస్సు పైబడినవారు సెంటర్ల వద్ద పడిగాపులు పడవద్దని, గుంపులుగా చేరవద్దని ఈ నోటీసులో అభ్యర్థించారు. తమ పేర్లను రిజిస్టర్ చేసుకున్నవారికి వ్యాక్సిన్ ఇచ్చే అవకాశం ఉందని మాత్రం వివరించారు.
కచ్చితంగా మే 1 నుంచి టీకామందులు వేసే కార్యక్రమాన్ని చేపడతామని చెప్పలేమని వారు స్పష్టం చేశారు. నిన్నటి నుంచే నగరానికి వ్యాక్సిన్ కొరత ఏర్పడింది. 1.5 లక్షల డోసులు రావలసి ఉండగా అది అందలేదని అధికారులు వెల్లడించారు.