ఢిల్లీలోని సఫ్దర్జంగ్లో 1.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు
Delhi: అతిశీతల గాలులతో వణుకుతున్న ఢిల్లీ, హర్యానా, చండీగఢ్ రాష్ట్రాలు
ఢిల్లీలోని సఫ్దర్జంగ్లో 1.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు
Delhi: దట్టమైన పొగ మంచు, తీవ్రమైన చలి గాలులతో ఉత్తరాది రాష్ట్రాలు వణికిపోతున్నాయి. వాయవ్య, మధ్య, తూర్పు భారతంలో దట్టమైన పొగ మంచు తెరలు అలముకోవటంతో రోడ్డు, రైల్వే, విమాన మార్గాల ప్రయాణాలపై ప్రభావం చూపుతుంది. ఢిల్లీలోని సఫ్దర్ జంగ్ ప్రాంతంలో ఆదివారం 1.9 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. చలి వాతావరణం వ్యవసాయం, పశువులు, నీటి సరఫరా, రవాణా, విద్యుత్తు రంగాలపై కొన్నిచోట్ల ప్రభావం చూపిస్తుందని IMD తెలిపింది. చలి వల్ల గడ్డ కట్టే పరిస్థితులు ఉండటంతో, ప్రజలు ఇండ్లలోనే ఉండాలని సూచించింది. అటు ఢిల్లీలో ప్రైవేట్ స్కూళ్లకు సెలవులను జనవరి 15 వరకు పొడిగించారు. తీవ్ర చలిగాలుల నేపథ్యంలో స్కూళ్లను మూసివేయాలని ఢిల్లీ ప్రభుత్వం సర్క్యులర్లో పేర్కొంది.
శీతల పరిస్థితులు కారణంగా దేశంలోని చాలా ప్రాంతాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు కొత్త రికార్డులను నమోదవుతున్నాయి. ఢిల్లీ సహా కొన్ని నిర్దిష్టమైన ఉత్తరాది ప్రాంతాలకు ఐఎండీ ఆరెంజ్ అలర్ట్ను జారీ చేసింది. రాజస్థాన్, హర్యానా, చండీగఢ్, ఢిల్లీలోని కొన్ని ప్రాంతాల్లో అతి శీతల గాలులు వీస్తున్నాయి. మరోవైపు రానున్న రోజుల్లో ఉత్తరాఖండ్, రాజస్థాన్, బీహార్, పశ్చిమ బెంగాల్, సిక్కిం, ఆస్సాం, త్రిపురలో దట్టమైన పొగమంచు కురుస్తుందని వాతావరణశాఖ అంచనా వేసింది.