Maha kumbha mela: గంగా నదిలో మునిగితే పేదరికం తొలగిపోతుందా?: ఖర్గే
Maha kumbha mela: ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ లో జరుగుతున్న మహాకుంభమేళా సందర్బంగా బీజేపీ నేతలు పవిత్ర స్నానాలు ఆచరించడంపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే తీవ్ర విమర్శలు చేశారు. గంగానదిలో మునిగితే దేశంలో పేదరికం తొలగిపోతుందా అంటూ ప్రశ్నించారు. ఆకలితో ఉన్నవారి కడుపులు నిండుతాయ అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. సోమవారం మధ్యప్రదేశ్ లోని మూవ్ లో జరిగిన జై బాబు, జై భీమ్, జై సంవిధన్ సభలో మల్లిఖార్జున్ ఖర్గే మాట్లాడారు. నేను ఎవరి విశ్వాసాన్ని ప్రశ్నించాలనుకోవడం లేదు. ఎవరైనా తప్పుగా భావిస్తే..నేను క్షమాపణలు కోరుతున్నాను. అయితే నాకు చెప్పండి..ఒక పిల్లవాడు ఆకలితో చనిపోతున్నప్పుడు, పాఠశాలకు వెళ్లనప్పుడు, కార్మికులకు వారి బకాయిలు అందనప్పుడు అలాంటి సమయంలో ఈ వ్యక్తులు వేల రూపాయలు ఖర్చు చేసి గంగానదిలో మునగడానికి పోటీ పడుతున్నారు. ఫోటోల్లో బాగా కనిపించేంత వరకు వారి స్నానాలు కొనసాగుతాయని ఖర్గే విమర్శలు చేశారు.
ఇలాంటి వ్యక్తులు దేశానికి మేలు చేయలేరన్నారు. దేవుడిపై మాకు విశ్వాసం ఉందని..ప్రజలు ప్రతిరోజూ ఇంట్లో పూజలు చేస్తారు. అందరు మహిళలు పూజ తర్వాతే ఇళ్ల నుంచి బయటకు వస్తారు. ఎలాంటి సమస్య లేదు. కానీ మతం పేరుతో పేదలు దోపిడికి గురవుతున్నారన్నది మా సమస్య అని అన్నారు. అయితే ఖర్గే ముందు మాట్లాడిన రాహుల్ గాంధీ కూడా బీజేపీ పై తీవ్ర విమర్శలు చేశారు.