పొంగల్ రోజున కేరళ టూరిజం శాఖ బీఫ్ వంటకం గురించి చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో తీవ్ర వివాదానికి దారి తీసింది. గోవులను పూజించే రోజున ఇలాంటి ట్వీట్ చేయడం ఏంటని చాలా మంది కేరళ పర్యాటక శాఖను ప్రశ్నించారు.
సంక్రాంతి పండుగ రోజున కేరళ టూరిజం అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్ నుంచి బీఫ్ వంటకం విషయమై చేసిన ట్వీట్.. సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేపింది. బీఫ్ ఫొటోను ట్వీట్ చేసిన కేరళ టూరిజం.. దాని రెసిపి లింక్ను కూడా షేర్ చేసింది. బీఫ్ ఫొటోతో చేసిన ట్వీట్లు తమ మనోభావాలను దెబ్బతీశాయని చాలా మంది ఆవేదన వ్యక్తం చేశారు. ఇతర రాష్ట్రాల ప్రజలు మకర సంక్రాంతి, భోగీ, బిహూ లాంటి పండుగలు జరుపుకొంటున్న రోజున బీఫ్ వంటకం గురించి ట్వీట్ చేయడం సరికాదని కొందరు అభిప్రాయపడ్డారు.
ఈ ట్వీట్ పర్యాటకాన్ని ప్రోత్సహించడానికా? బీఫ్ను ప్రమోట్ చేయడానికా? ఇది గోమాతను పూజించే కోట్లాది మంది మనోభావాలను ఇది దెబ్బతీయదా? శంకరాచార్యుడు జన్మించిన పుణ్య భూమి నుంచి ఇలాంటి ట్వీట్ వచ్చిందా?' అని వీహెచ్పీ జాతీయ అధికార ప్రతినిధి వినోద్ బన్సాల్ ఘాటైన సమాధానం ఇచ్చారు.
గోవులను పూజించే తరుణంలో ఇలాంటి ట్వీట్ చేయడం కేరళ టూరిజం అభిరుచిని తెలియజేస్తోందని కొందరు మండిపడ్డారు. ఈద్ పర్వదినాన పంది మాసం గురించి, మకర సంక్రాంతి రోజున బీఫ్ గురించి ట్వీట్ చేయొద్దని ఓ నెటిజన్ ట్వీట్ చేశారు. పవిత్ర దినాల్లో సాంస్కృతిక సున్నితత్వాన్ని పాటించాలని ఆయన సూచించారు.