టెలికం మార్కెట్లో సంచలనం సృష్టించిన రిలయన్స్ జియో... త్వరలోనే జియో గిగాఫైబర్ ద్వారా మరో విప్లవానికి రెడీ అవుతోంది. రిలయన్స్ జియో నెలకు రూ.600లతో గిగాఫైబర్ సేవలను ప్రారంభించే అవకాశముందని జాతీయ మీడియా కధనాలు ప్రసారం చేసింది. గిగాఫైబర్ కింద బ్రాండ్బ్యాండ్, టెలివిజన్, ల్యాండ్లైన్ సేవలన్నింటినీ అందిస్తామని కంపెనీ గతంలోనే తెలిపింది. ఇందుకోసం ఫైలెట్ ప్రాజెక్ట్ కింద వన్టైమ్ డిపాజిట్ కింద రూటర్ కోసం రూ.4,500 తీసుకుని, 100 గిగాబైట్స్ డేటాను 100 ఎంబీపీఎస్ వేగంతో ఉచితంగా వినియోగదారులకు అందిస్తూ వారి నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుంటోంది.
ఈ మూడు రకాల సేవలు రూటర్ ద్వారా అందించడం జరుగుతుంది. జియో గిగాఫైబర్తో 100 ఎంబీపీఎస్ స్పీడ్తో 100 జీబీ డేటాను ఉచితంగా పొందొచ్చు. టెలీఫోన్, టెలివిజన్ సర్వీసులు వచ్చే మూడు నెలల కాలంలో గిగాఫైబర్తో అనుసంధానం కావొచ్చు. జియో స్మార్ట్ హోమ్ నెట్వర్క్కు స్మార్ట్ఫోన్స్, ల్యాప్టాప్స్ వంటి 40 డివైస్లను కనెక్ట్ చేసుకునే ఆప్షన్ ఉంటుందని నిపుణులు అంటున్నారు. గిగాఫైబర్తో సీసీటీవీ సర్వేలెన్స్ వీడియోలను, ఇతర డేటాను క్లౌడ్లో సేవ్ చేసుకోవచ్చని తెలుస్తోంది. దేశవ్యాప్తంగా ఒకే సారి 1,100 పట్టణాల్లో జియో గిగాఫైబర్ను ఆరంభించనున్నట్టు గతేడాది జూన్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ వార్షిక సాధారణ సమావేశంలో చైర్మన్ ముకేశ్ అంబానీ ప్రకటించిన విషయం తెలిసిందే.