జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మరికొన్ని గంటల్లో వెలువడనున్నాయి. ఈ నేపథ్యంలో.. అక్కడి ఎవరు ప్రభుత్వం చేయబోతున్నారనేదానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. దేశంలో తిరుగులేని శక్తిగా ఎదిగిన బీజేపీకి జార్ఖండ్ రూపంలో షాక్ తగలనుందా. ? అక్కడ మరోసారి అధికారంలోకి రావాలనుకుంటున్న కమలనాథుల కలలు నిరవేరనున్నాయా? తాజా పరిస్థితులు ఏం చెబుతున్నాయి.
జార్ఖండ్లో మధ్యప్రదేశ్, మహారాష్ట్ర తరహా రాజకీయ వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఎగ్జిట్ పోల్స్ చూస్తుంటే జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బీజేపీకి ఫలితాలు షాకిచ్చేలా కనిపిస్తున్నాయి. పలు సంస్థలు విడుదల చేసిన ఎగ్జిట్ పోల్స్లో బీజేపీకి ఊహించని షాక్ తగిలింది. జార్ఖండ్లో కాంగ్రెస్-జేఎంఎం కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నాయని సర్వే సంస్థలు అంచనా వేశాయి. బీజేపీ 22-32 స్థానాలకే పరిమితం అవుతుందని, కాంగ్రెస్-JMM-RJD కూటమికి 38-50 సీట్లను సొంత చేసుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉందని పలు సంస్థలు అంచనా వేశాయి. కొన్ని సంస్థలు… హంగ్ వచ్చే అవకాశం కూడా ఉందంటూ స్పష్టం చేశాయి.
మొత్తం 81 అసెంబ్లీ స్థానాలున్న జార్ఖండ్లో ప్రభుత్వ ఏర్పాటుకు 41 ఎమ్మెల్యే మద్దతు అవసరం. ఎగ్జిట్ పోల్స్ విడుదల సర్వే బీజేపీ నేతలను తీవ్ర నిరాశకు గురిచేసింది. దీనిపై స్పందించిన ముఖ్యమంత్రి రఘువర్ దాస్ విజయంపై ధీమా వ్యక్తంచేశారు. మరోసారి తామే అధికారాన్ని చేపడతామని స్పష్టం చేశారు. జార్ఖండ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ ముఖ్యనేతలు సుడిగాలి ప్రచారం నిర్వహించారు. ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తదితరులు ముమ్మర ప్రచారం చేశారు. అదే విధంగా కాంగ్రెస్ పార్టీ ఎంపీ, మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సైతం జోరుగా ప్రచారం నిర్వహించారు.
ఎగ్జిట్ పోల్స్ అంచనాలు ఎలా ఉన్నా గెలుపుపై ఎవరికి వారు ధీమాగా ఉన్నారు. మేజిక్ ఫిగర్ 41కి ఎవరు చేరుతారు? ఎవరికి ప్రజలు పట్టంకట్టారన్నది మరి కొన్ని గంటల్లో తేలిపోనుంది. మరోవైపు ఏ కూటమి మేజిక్ ఫిగర్కి చేరుకోలేకపోతే హర్యానాలో మాదిరిగా ఇండిపెండెంట్లు ఇతర చిన్న పార్టీలు కీలకంగా మారనున్నాయి. అటు హర్యానాలో ప్రభుత్వం ఏర్పాటు చేయగలిగినా మహారాష్ట్రలో బీజేపీ గద్దెనెక్కలేకపోయింది. ఈ నేపథ్యంలో జార్ఖండ్ ఫలితాలు ఎలా ఉండనున్నాయో సర్వత్రా ఆసక్తి నెలకొంది.
వచ్చే ఏడాది ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే మధ్యప్రదేశ్, మహారాష్ట్ర పోగొట్టుకున్న బీజేపీకి జార్ఖండ్లోనూ ఓడితే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు సవాలుగా మారనున్నాయి.