చంద్రయాన్-2 వాహకనౌక భూ కక్ష్యను పెంచే రెండో ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేశారు ఇస్రో శాస్త్రవేత్తలు. బుధవారం మధ్యాహ్నం మొదటి భూ కక్ష్యను పెంచగా.. శుక్రవారం తెల్లవారుజామున 1.08 నిమిషాలకు రెండోసారి కక్ష్యను పెంచారు. దీంతో ప్రస్తుతం చంద్రయాన్-2 వాహకనౌక 251×56829 కిలోమీటర్ల ఎత్తున ఉన్న భూ కక్ష్యలోకి చేరింది. ఆన్బోర్డులో ఉన్న ఇంధనాన్ని883 సెకెన్లపాటు మండించడం ద్వారా విజయవంతంగా కక్ష్యను పెంచినట్లు ఇస్రో వెల్లడించింది. వాహకనౌక పారామీటర్లన్నీ సరిగా ఉన్నట్లు ఇస్రో పేర్కొంది. మూడోసారి కక్ష్యను పెంచే ప్రక్రియను జూలై 29న మధ్యాహ్నం చేపట్టనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఆగస్టు 14 వరకు ఇలా కక్ష్యలు పెంచే ప్రక్రియను చేపడతామని ఇస్రో వెల్లడించింది.