ఏప్రిల్ 30 వరకూ రైల్వే బుకింగ్స్ రద్దు..
కరోనా వైరస్ రోజురోజుకు విస్తరించడంతో ముందస్తు చర్యలలో భాగంగా కేంద్ర ప్రభుత్వం 21 రోజుల లాక్ డౌన్ విధిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది.
కరోనా వ్యాప్తిని కట్టడి చేసేందుకు దేశవ్యాప్తంగా లాక్ డౌన్ను మరికొన్ని వారాలు కొనసాగించాలని పలు రాష్ట్రాలు ప్రభుత్వాలు కేంద్రాన్ని కోరుతున్నాయి. దీంతో కేంద్రం ప్రభుత్వం కూడా ఈ దిశగానే నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే భారతీయ రైల్వే శాఖ అనుబంధ సంస్థ అయిన ఐఆర్సీటీసీ తీసుకున్న తాజా నిర్ణయంతో లాక్డౌన్ పొడిగింపుపై పరోక్ష సంకేతాన్ని ఇచ్చినట్టు కనిపిస్తోంది.
ఏప్రిల్ 30 వరకూ రైల్వే టికెట్లను ఆన్లైన్లో రిజర్వేషన్ చేసుకునే సదుపాయాన్ని రద్దు చేస్తున్నట్లు ఐఆర్సీటీసీ తెలిపింది. ఏప్రిల్ 15 నుంచి 30 వరకు టికెట్లు బుకింగ్ చేసుకున్న వారికి నగదు తిరిగి చెల్లిస్తామని ప్రకటించింది.
రైల్వే టికెట్ల బుకింగ్స్తో పాటు ప్రస్తుతం ఐఆర్సీటీసీ తేజస్ ఎక్స్ప్రెస్ పేరుతో 3 రైళ్లను నడుపుతోంది. వీటిలో అహ్మదాబాద్ నుంచి ముంబై ఢిల్లీ నుంచి లక్నో మార్గాల్లో ప్రయాణించే రైళ్లు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఏప్రిల్ చివరి వరకూ లాక్డౌన్ పొడిగించాలన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నారనే ఊహాగానాలు వినిపిస్తోంది.