IPS Officer: ఐపీఎస్ అధికారి ఆత్మహత్య!
ఐపీఎస్ అధికారి ఆత్మహత్యకు కారకులపై వెంటనే చర్యలు తీసుకోవాలి: రాహుల్.
IPS Officer: ఐపీఎస్ అధికారి ఆత్మహత్య!
హరియాణాలోని సీనియర్ ఐపీఎస్ అధికారి పూరన్ కుమార్ ఆత్మహత్యకు కారణమైన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) డిమాండ్ చేశారు. మంగళవారం ఆయన పూరన్ కుమార్ కుటుంబాన్ని కలిశారు. ఈ సందర్భంగా పూరన్కు నివాళులర్పించిన ఆయన.. బాధిత కుటుంబానికి సానుభూతి తెలిపారు. అనంతరం రాహుల్ విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వాధికారిపై ఇలాంటి వివక్ష చోటుచేసుకోవడం విషాదకరమన్నారు. ఈ కేసుకు సంబంధించి స్వేచ్ఛగా, నిష్పాక్షికంగా విచారణ జరుపుతామని స్వయంగా హరియాణా ముఖ్యమంత్రి నాయబ్ సింగ్ సైనీ హామీ ఇచ్చారన్నారు. కానీ, రోజులు గడుస్తున్నా.. అది నెరవేరటం లేదని విమర్శించారు. తండ్రిని పోగొట్టుకున్న పూరన్కుమార్ ఇద్దరు పిల్లలు చాలా ఒత్తిడిలో ఉన్నారన్నారు. పూరన్ కుమార్ కెరీర్ను, ప్రతిష్ఠను దెబ్బతీసేందుకే ఇతర అధికారులు సంవత్సరాలుగా వివక్ష కొనసాగించారని స్పష్టంగా తెలుస్తోందన్నారు. ఇది కేవలం ఒక దళిత కుటుంబానికి సంబంధించినది కాదని, దేశంలోని కోట్లాది మంది దళితులకు సంబంధించినదని రాహుల్ వ్యాఖ్యానించారు. హరియాణా ఐపీఎస్ ఆత్మహత్య.. డీజీపీని సెలవుపై పంపిన ప్రభుత్వం. ఈ సందర్భంగా ఐపీఎస్ అధికారిపై జరిగిన వివక్ష దళితులుగా ఎంత విజయం సాధించినా.. అణచివేత తప్పదనే తప్పుడు సందేశం వారికి వెళ్లేలా చేస్తుందన్నారు. పూరన్ కుమార్ ఆత్మహత్యకు కారకులైన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని ప్రధాని మోదీ, సీఎంలను డిమాండ్ చేశారు. బాధిత కుటుంబంపై ఉన్న ఒత్తిడిని తొలగించాలన్నారు. ఇక, ఈ కేసుకు సంబంధించి వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న డీజీపీ శత్రుజీత్ కపూర్ను రాష్ట్ర ప్రభుత్వం సెలవుపై పంపించిన సంగతి తెలిసిందే. ఈ బాధ్యతలను తాజాగా ఓం ప్రకాశ్ సింగ్కు అప్పజెప్పింది. కాగా.. ఈ కేసుకు సంబంధించి రోహ్తక్ ఎస్పీ నరేంద్ర బిజర్నియాను ఇటీవల బదిలీ చేసిన సంగతి తెలిసిందే