కరోనా ఆసుపత్రులను మూడు విభాగాలుగా వర్గీకరించాలని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ నిర్దేశించింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాలకూ మార్గదర్శకాలు జారీచేసింది. కొవిడ్ సంరక్షణ కేంద్రం, కొవిడ్ ఆరోగ్య కేంద్రం, కొవిడ్ ఆసుపత్రి పేరుతో వీటిని వర్గీకరించాలని సూచించింది. రోగ తీవ్రత తక్కువ, మధ్యస్థాయి, ఎక్కువస్థాయిలో ఉన్న రోగులను వీటి మధ్య విభజించాలని స్పష్టంచేసింది.
కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ సూచన ప్రకారం మొదటిది సంరక్షణ కేంద్రం. తక్కువ, అతి తక్కువ, అనుమానిత కేసులను ఇక్కడ పెట్టాలి. ఇది తాత్కాలికం కావచ్చు. వసతిగృహాలు, హోటళ్లు, పాఠశాలలు, స్టేడియంలు, లాడ్జ్లు, ధర్మశాలల్లో వీటిని ఏర్పాటు చేసుకోవచ్చు. క్వారంటైన్ కేంద్రాలను కొవిడ్ సంరక్షణ కేంద్రాలుగానూ మార్చుకోవచ్చు. సంరక్షణ కేంద్రం కేంద్రాన్ని ఆసుపత్రి, ఆరోగ్య కేంద్రంతో మ్యాపింగ్ చేయాలి. ఇక్కడున్న రోగులకు తదుపరి వైద్యసేవలు అవసరమైతే అందుకు అవసరమైన ప్రణాళిక తయారుచేసి సిద్ధంగా ఉంచుకోవాలి.
కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ సూచన ప్రకారం రెండోది ఆరోగ్య కేంద్రం. ఇందులో రోగ తీవ్రత కొంత ఎక్కువ ఉన్న వారిని ఉంచాలి. పూర్తి ఆసుపత్రిని లేదా ఆసుపత్రిలో కొంత భాగాన్ని ఇందుకోసం కేటాయించాలి. ఆరోగ్య కేంద్రంలో ఆక్సిజన్తో కూడిన పడకలు ఉండాలి.
కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ సూచన ప్రకారం మూడోది ఆసుపత్రులు. లక్షణాల తీవ్రత, ప్రమాదం ఎక్కువగా ఉన్న రోగులకు ఆసుపత్రిలో చికిత్స అందించాలి. ఆసుపత్రులు లేదంటే బ్లాక్లను ఇందుకు కేటాయించాలి. వీటిలో ఐసీయూ సౌకర్యం, వెంటిలేటర్లు ఉండాలి.