Delhi: దేశరాజధానిని ముంచేత్తిన వాన..జలమయమైన నగరం..నిలిచిన 100కుపైగా విమానాలు

Update: 2025-05-25 04:02 GMT

Delhi: దేశరాజధానిని ముంచేత్తిన వాన..జలమయమైన నగరం..నిలిచిన 100కుపైగా విమానాలు

Delhi: దేశ రాజధాని ఢిల్లీలో భారీ వర్షం కురిసింది. ఆదివారం తెల్లవారుజామున ఢిల్లీతోపాటు రాజధాని ప్రాంతంలో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. ఈదురుగాలులకు పలుచోట్ల రూడ్లపై చెట్లు విరిగిపడిపోయాయి. రహదారులన్నీ వరద నీటితో నిండిపోయాయి. దీంతో ప్రధాన జంక్షన్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. వందకు పైగా విమానాల రాకపోకలు నిలిచిపోయాయి. మరో 25కిపైగా విమానాలు దారి మళ్లించారు.

ఈ నేపథ్యంలో ప్రయాణికులకు ఢిల్లీ ఎయిర్ పోర్టు అడ్వైజరీ జారీ చేసింది. ప్రతికూల వాతావరణంతో విమానాల రాకపోకలపై ప్రభావం పడిందని..ఇంకా సర్వీసులను పునరుద్ధరించలేదని పేర్కొంది. ప్రయాణికులు తమ విమానయాన సంస్థలను సంప్రదించాలని కోరింది. ఢిల్లీలో అనేక ప్రాంతాల్లో 5 నుంచి 8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు అయినట్లు భారత వాతావరణ శాఖ తెలిపింది. సఫ్దర్ జంగ్ ప్రాంతంలో 81 మిలీమీటర్లు, పాలంలో 68 మిల్లీ మీటర్లు, పూసా 71 మిల్లీమీటర్లు, మయూర్ విహార్ లో 48 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదు అయ్యింది. గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయని ఐఎండీ తెలిపింది. భారీ వర్షంతో మింటో రోడ్డు దగ్గరి ప్రాంతం పూర్తిగా నీటితో నిండిపోవడంతో ఓ కారు అందులో మునిగిపోయింది.

Tags:    

Similar News