అమెరికాలోని అలబామాలో భారీ అగ్నిప్రమాదం

Update: 2020-01-28 04:06 GMT

అమెరికాలోని అలబామాలో అగ్నిప్రమాదం చోటుచేసుకొని 8 మంది మృతిచెందారు. ఉత్తర అలబామాలో టెన్నెస్సీ నదీ తీరం వెంబడి ఉన్న బోటు డాక్‌యార్డులో ఈ ఘటన చోటుచేసుకుంది. దాదాపు 35 పడవలు మంటల్లో చిక్కుకున్నట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఘటనలో చాలా మంది గల్లంతయ్యారు. అసలు పడవల్లో ఎంత మంది ఉన్నారో తెలియలేదు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అక్కడి అధికారులు చెప్పారు. తీవ్రంగా గాయపడిన ఏడుగురిని ఆస్పత్రికి తరలించారు.

మొదట జాక్సన్‌ కంట్రీ పార్క్‌కు అంటుకున్న మంటలు ఆ తర్వాత డాక్‌యార్డు వైపునకు వేగంగా విస్తరించాయి. పడవల్లో ఎక్కువ మంది గాఢనిద్రలో ఉండడంతో ప్రమాద తీవ్రత పెరిగింది. అంతేకాకుండా అవి ఎక్కువగా చెక్కలతో నిర్మించినవి కావడంతో మంటలు తొందరగా వ్యాపించాయి. పడవలపై ఉండే అల్యూమినియం రేకులు విరిగిపడుతుండటంతో మంటల్లో చిక్కుకున్న వారిని రక్షించే ప్రయత్నాలు ఫలించలేదు. ప్రాణాలు కాపాడుకునేందుకు పలువురు టెన్నెస్సీ నదిలో దూకారు. నీటిలో దూకిన పలువురుని అధికారులు రక్షించారు. 15 నుంచి 20 నిమిషాల్లోపే డాక్‌యార్డ్‌ మొత్తం మంటల్లో చిక్కుకుందని స్థానికులు తెలిపారు. చాలా పడవల్లో గ్యాస్‌ ట్యాంకులు ఉన్నట్లు వారు పేర్కొన్నారు.   

Tags:    

Similar News