తన డ్యూటీ ముగిసిందని గూడ్స్ రైలు మధ్యలో ఆపేశాడు ఓ లోకో పైలెట్. ఈ ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. తమిళనాడులోని నాగపట్నం జిల్లా శీర్గాలి సమీపంలోసరిగ్గా లెవల్ క్రాసింగ్, రైల్వే గేటుకు మధ్యలో సడన్ గా గూడ్స్ రైలు ఆగిపోయింది. రైలును ఆపేసి లోకో పైలెట్ ముత్తురాజ్ కిందకు దిగేశాడు. తన డ్యూటీ సమయం ముగిసి అరగంట అవుతున్నా వేరే లోకో పైలెట్ రాలేదని, ఇక తాను రైలును ముందుకు నడపనంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. అంతేకాకుండా తన బ్యాగ్ను సర్దుకుని అక్కడి నుంచి వెళ్లిపోయేందుకు కూస్తో సిద్దమయ్యాడు.
అయితే రైలు ఎంతకూ ముందుకు కదలకపోవడం, గేటు తెరుచుకోకపోవడంతో వాహదారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో అక్కడే ఉన్న గేట్మెన్ను ప్రశ్నిస్తే అసలు విషయం తెలిసింది. దీంతో చేసేదేమి లేక ఫోన్ లలో రైల్వే అధికారులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న రైల్వే ఉన్నతాధికారులు వైర్లెస్ సెట్ ద్వారా ముత్తురాజ్తో మాట్లాడారు. మైలాడుదురై జంక్షన్ వరకు గూడ్స్ నడపాలని కోరడంతో ఎట్టకేలకు ముత్తురాజ్ గూడ్స్ను ముందుకు కదిలించాడు. ఈ పరిణామంతో సుమారు గంట పాటు గూడ్స్ రైలు అక్కడే ఆగడంతో శీర్గాలి – పుంగనూరు మార్గంలో ఎక్కడి వాహనాలు అక్కడే ఆగిపోయాయి.