Delhi liquor case: ఢిల్లీ లిక్కర్ కేసులో సంచలనం.. కేజ్రీవాల్ సహా అందరికీ రిలీఫ్.. తీర్పులో ఏముందంటే . .
Delhi liquor case: దేశవ్యాప్తంగా పెద్ద సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ కేసులో 23మందిపై అభియోగాలను రౌస్ అవెన్యూ కోర్టు కొట్టివేసింది. తీర్పులోని ముఖ్యాంశాలు ఇవే
Delhi Liquor Case
Delhi liquor case: దేశవ్యాప్తంగా పెద్ద సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ కేసులో పెద్ద బ్రేక్ వచ్చింది. కేసులో నిందితులుగా ఉన్న 23మందిపై అభియోగాలను రౌస్ అవెన్యూ కోర్టు కొట్టివేసింది. రాజకీయంగా పెను వివాదం రేపిన.. ప్రభుత్వాలపై ప్రభావం చూపించిన కేసు ఇది. ఈ మద్యం కుంభకోణానికి సంబంధించిన సీబీఐ కేసులో మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాలను ఢిల్లీ కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. ఆధారాలు లేకుండా ఇద్దరిపై వచ్చిన ఆరోపణలను నిరూపించలేమని రౌస్ అవెన్యూ కోర్టు శుక్రవారం పేర్కొంది. ఈ కేసులో 23 మందిపై సీబీఐ చార్జిషీట్ దాఖలు చేసింది. కానీ, వారిలో ఎవరిపైనా అభియోగాలు మోపడానికి కోర్టు నిరాకరించి వారిని నిర్దోషులుగా విడుదల చేసింది.
రౌస్ అవెన్యూ కోర్ట్ ఏమందంటే.
- కోర్టు 23 మంది నిందితులను నిర్దోషులుగా ప్రకటించింది.
- వేల పేజీల నిడివి గల ఛార్జ్ షీట్ లో చాలా లోపాలు ఉన్నాయి. అందులో చేసిన ఆరోపణలు ఏ సాక్షి లేదా వాంగ్మూలం ద్వారా నిరూపణ కాలేదు.
- సిసోడియాపై కేసును సీబీఐ ఎక్కడా కూడా నిరూపించలేకపోయింది.
- ఎటువంటి ఖచ్చితమైన ఆధారాలు లేకుండానే కేజ్రీవాల్ పేరును లింక్ చేశారు. రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తికి సంబంధించిన విషయంలో, ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం చట్ట సూత్రాలకు విరుద్ధం. ఎటువంటి ప్రకటనలు లేదా ఆధారాలు లేనప్పుడు, కేజ్రీవాల్ను కుట్రలో భాగంగా ముద్ర వేయడం సమర్థనీయం కాదు.
- సాక్షుల వాంగ్మూలాలకు సంబంధం లేని అనేక అంశాలను ఛార్జిషీట్లో చేర్చారు. మొత్తం కుట్ర సిద్ధాంతాన్నే బలహీనపరిచే వైరుధ్యాలు ఛార్జిషీట్లో ఉన్నాయి.
- ప్రధాన నిందితుడు కుల్దీప్ సింగ్ను నిర్దోషిగా ప్రకటిస్తూ న్యాయమూర్తి మాట్లాడుతూ, అతనిపై ఎటువంటి ఖచ్చితమైన ఆధారాలు లేనప్పుడు అతన్ని మొదటి నిందితుడిగా ఎందుకు చేశారనేది ఆశ్చర్యంగా ఉందని అన్నారు.
- సీబీఐ దర్యాప్తు అధికారి (IO)పై శాఖాపరమైన విచారణకు కూడా కోర్టు ఆదేశించింది.
- మద్యం విధానాన్ని రూపొందించడం, అమలు చేయడంలో సిసోడియా బాధ్యత వహించారని ఆరోపణలు వచ్చాయి. కానీ అతని ప్రమేయానికి సంబంధించిన ఎటువంటి ఆధారాలు కనబడలేదని కోర్టు తెలిపింది.
ఈ తీర్పుతో ఆమ్ ఆద్మీ పార్టీ నేతలతో పాటు, ఇదే కేసులో 150 రోజుల పాటు జైలులో ఉన్న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత కు కూడా క్లీన్ చిట్ రావడం ఇప్పుడు సంచలనాత్మకంగా మారింది.
Delhi liquor case:ఈ నేపథ్యంలో గతంలో లీక్ అయినా కాగ్ రిపోర్టుపై చర్చ మొదలైంది. ఆ రిపోర్టు ప్రకారం ప్రభుత్వానికి ₹2,026 కోట్ల ఆదాయ నష్టం వాటిల్లింది. ఇప్పుడు ఈ కేసు విషయంలో సీబీఐ ఎలా వ్యవహరిస్తుందనేది వేచి చూడాల్సిందే.
ఢిల్లీ మద్యం కేసు వివరాలివే..
ఢిల్లీ ప్రభుత్వానికి చెందిన 'ఎక్సైజ్ పాలసీ 2021-22' దేశవ్యాప్తంగా రాజకీయంగా పెద్ద ప్రకంపనలు సృష్టించింది. ఈ పాలసీ రూపకల్పన, అమలులో భారీ అవినీతి జరిగిందని ఆరోపిస్తూ దర్యాప్తు సంస్థలైన సీబీఐ (CBI) మరియు ఈడీ (ED) ఈ కేసును నమోదు చేశాయి. సుదీర్ఘకాలంగా సాగుతున్న ఈ కేసు అనేక మలుపులు తిరుగుతూ తాజాగా కీలక దశకు చేరుకుంది.
కేసు నేపథ్యం ఏమిటి? ఢిల్లీలో మద్యం విక్రయాల కోసం ఆప్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ నూతన పాలసీ వల్ల ప్రభుత్వ ఆదాయం తగ్గడమే కాకుండా, ప్రైవేటు వ్యక్తులకు భారీగా లాభాలు చేకూరాయని దర్యాప్తు సంస్థలు ఆరోపించాయి. ఈ పాలసీలో భాగంగా ఎంపిక చేసిన వారికి 'క్విడ్ ప్రో కో' (ప్రతిఫలంగా లబ్ధి) కింద ముడుపులు అందినట్లు, ఆ నిధులను గోవా, పంజాబ్ ఎన్నికల్లో ఖర్చు చేశారని దర్యాప్తు సంస్థలు పేర్కొన్నాయి.
ప్రధాన ఆరోపణలు:
- మద్యం లైసెన్స్ల కేటాయింపులో అక్రమాలు జరిగాయని, సిండికేట్లకు అనుకూలంగా నిబంధనలను సడలించారని ఆరోపణలు వచ్చాయి.
- ఎంపిక చేసిన వ్యాపారుల నుంచి భారీగా ముడుపులు వసూలు చేశారని దర్యాప్తు సంస్థలు ఈడీ, సీబీఐ తమ చార్జిషీట్లలో పేర్కొన్నాయి.
- ఈ కేసులో మనీలాండరింగ్ (డబ్బును అక్రమంగా తరలించడం) జరిగిందని ఈడీ ప్రత్యేక దృష్టి సారించింది.
ఈ కేసులో క్లీన్ చిట్ వచ్చిన 23 మంది వీరే!
1) కులదీప్ సింగ్
2) నరేందర్ సింగ్
3) విజయ్ నాయర్
4) అభిషేక్ బోయిన్పల్లి
5) అరుణ్ రామచంద్ర పిళ్లై
6) మూత గౌతం
7) సమీర్ మహేంద్రుడు
8) మనీష్ సిసోడియా
9) అమన్దీప్ సింగ్ ధాల్
10) అర్జున్ పాండే
11) బుచ్చిబాబు గోరంట్ల
12) రాజేష్ జోషి
13) దామోదర్ ప్రసాద్ శర్మ
14) ప్రిన్స్ కుమార్
15) అరవింద్ కుమార్ సింగ్
16) చన్ప్రీత్ సింగ్ రాయత్
17) కవిత
18) అరవింద్ కేజ్రీవాల్
19) దుర్గేష్ పాఠక్
20) అమిత్ అరోరా
21) వినోద్ చౌహాన్
22) ఆశిష్ చంద్ మాథుర్
23) శరత్ చంద్ర రెడ్డి