ప్రేమకు వయస్సు అడ్డు కానే కాదు.. అది ఎప్పుడు ఎక్కడ పుడుతుందో ఎవరు చెప్పగలరు. 60 ఏళ్లకు పైబడిన వారి మధ్య ప్రేమ చిగురించింది. ప్రేమతోనే ఆగకుండా.. పెళ్లితో ఒక్కటయ్యారు.. మూడు ముళ్లు వేశారు.. ఏడడుగులు నడిచారు. కేరళలోని ఓ వృద్ధాశ్రమం వేదికగా జరిగిన వృద్ధ జంట వివాహం.. అందరినీ ఆకర్షించింది. తిస్సూర్కు చెందిన 67 ఏళ్ల కొచానియన్, 65 ఏళ్ల లక్ష్మీ అమ్మాళ్ ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. గతంలో లక్ష్మీ అమ్మాళ్ భర్త దగ్గర కొచానియన్ పనిచేశాడు. కాలక్రమంలో లక్ష్మీ అమ్మాళ్ భర్త, కొచానియన్ భార్య చనిపోగా.. ఇద్దరూ ఓ వృద్ధాశ్రమానికి చేరుకున్నారు.
అప్పటికే పరిచయం ఉన్న వీరు.. వృద్ధాశ్రమంలో ఒకరి కష్టసుఖాలు మరొకరు పంచుకున్నారు. ఈ క్రమంలో వారిద్దరి మధ్య ఉన్న పరిచయం.. ప్రేమగా మారింది. తమ ప్రేమ విషయాన్ని తోటి స్నేహితులకు, వృద్ధాశ్రమ అధికారులకు తెలిపారు. వారు కూడా సానుకూలంగా స్పందించారు. దీంతో వారికి పెళ్లి చేసి ఒక్కటి చేశారు. వీరి పెళ్లి వేడుకతో.. ఆశ్రమంలో పండుగ వాతావరణం నెలకొంది. ప్రస్తుతం వీరి పెళ్లి వేడుకలకు సంబంధించిన దృశ్యాలు.. సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
Kerala: 67-year-old Kochaniyan Menon and a 65-year-old Lakshmi Ammal, tied the knot yesterday at a government-run old-age home in Ramavarmapuram in Thrissur district. pic.twitter.com/EXJeXyv34G
— ANI (@ANI) December 29, 2019