ప్రాణం తీసిన సెల్ఫీ.. విగతజీవులుగా మారిన నవదంపతులు..

కర్ణాటకలో విషాదం చోటుచేసుకుంది. ముచ్చటపడి తీసుకున్న సెల్ఫీ.. దంపతుల ప్రాణం తీసింది.

Update: 2020-05-09 02:29 GMT

కర్ణాటకలో విషాదం చోటుచేసుకుంది. ముచ్చటపడి తీసుకున్న సెల్ఫీ.. దంపతుల ప్రాణం తీసింది. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రం హాసన్‌ సమీపంలోని హేమావతి నదీ వద్ద గురువారం సాయంత్రం చోటు చేసుకుంది. గురువారం సాయంత్రం హెన్నెలి గ్రామ సమీపంలో కొత్తగా పెళ్లి చేసుకున్న జంట హేమవతి నదిలో సెల్ఫీ తీసుకుంటున్న సమయంలో ప్రమాదవశాత్తు జారిపడి మునిగిపోయారు. దాంతో దంపతులిద్దరూ మృతి చెందారు.

మృతులు మురహళ్లి గ్రామానికి చెందిన అర్థేశ్‌(27), హెన్నలి గ్రామానికి చెందిన కృతికా(23) గా గుర్తించారు.. వారికి రెండు నెలల క్రితమే వివాహమైంది. అర్థశ్‌ బెంగళూరులో ఒక ప్రైవేట్‌ సంస్థలో పని చేస్తున్నాడు. లాక్‌డౌన్‌ కారణంగా సెలవు ప్రకటించటంతో రెండు రోజుల క్రితం అత్తవారిళ్లయిన హెన్నెలికి వెళ్లాడు. గురువారం సాయంత్రం ఈ జంట సరదాగా తమ మోటర్‌బైక్‌లో ప్రయాణించడానికి వెళ్లినట్లు డిఎస్‌పి గోపి తెలిపారు.

ఈ సమయంలో హేమావతి నదీ వద్దకు చేరుకొని సెల్ఫీతీసుకునేందుకు ప్రయత్నించగా దురదుష్టవశాత్తు అందులో పడిపోయారు. అయితే రాత్రి అవుతున్నా దంపతులిద్దరూ ఇంటికి రాకపోవడంతో కుటుంబసభ్యులు ఆందోళన చెందారు. ఫోన్‌ చేసినా ఎంతకీ ఎత్తకపోవడంతో నది ప్రాంతం వద్దకు వెళ్లగా బైక్‌ కనిపించింది. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు నది చుట్టూ గాలింపు చర్యలు చేపట్టగా మొదట కృతికా మృతదేహం బయట పడింది. ఆ తరువాత శుక్రవారం తెల్లవారుజామున అర్థేశ్ మృతదేహాన్ని కూడా వెలికితీశారు. దీంతో రెండునెలలకే కొత్త జంట విగతజీవులుగా పడి ఉండటం చూసి కుటుంబసభ్యులు తీవ విషాదంలో మునిగిపోయారు. పలువురు కంటతడి పెట్టారు.


Tags:    

Similar News