21 రోజుల లాక్డౌన్ ఎన్ని లక్షల కోట్లు నష్టం తెలుసా?
కరోనా వైరస్ నియంత్రణలో భాగంగా దేశవ్యాప్తంగా కేంద్రం 21రోజులు లాక్ డౌన్ ప్రకటించింది.
కరోనా వైరస్ నియంత్రణలో భాగంగా దేశవ్యాప్తంగా కేంద్రం 21రోజులు లాక్ డౌన్ ప్రకటించింది. అయితే ఇవాళ్టితో 21 రోజుల లాక్డౌన్ పూర్తవుతోంది. ఆర్థిక వ్యవస్థకు భారీగా పతనం అయింది. లాక్డౌన్ వల్ల దేశంలో భారీ పరిశ్రమలు, ఫ్యాక్టరీలు, కంపెనీలు మూతపడ్డాయి. అన్ని రకాల వ్యాపారాలూ స్థంభించిపోయాయి. విమానాశ్రయాలు, రైళ్లు నిలిచిపోయాయి. ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. ఫలితంగా ఆర్థిక వ్యవస్థకు దాదాపు రూ.7 నుంచి రూ.8 లక్షల కోట్ల నష్టం జరిగినట్లు అంచనా వేశారు.
కొవిడ్-19 కారణంగా 2020-2021 ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు ప్రమాదంలో కనిపిస్తోంది. ఇది 1.5 శాతం నుంచి 2.8 శాతం మధ్య ఉంటుందని ప్రపంచ బ్యాంక్ అంచనా వేసింది. కరోనా కారణంగా రోజూ భారత్కి రూ.35 వేల కోట్ల నష్టం కలుగుతోంది. ప్రధాని మోదీ ఇవాళ జాతినుంద్ధేశించి ప్రసంగించనున్నారు. లాక్డౌన్ను సడలించి కొన్ని వెసులుబాట్లు కల్పిస్తే ఆర్థిక వ్యవస్థకు ఎంతో మేలు చేస్తుంది. అలా కాకుండా లాక్డౌన్ కొనసాగిస్తే మరిన్ని కష్టాల్లోకి జారిపోక తప్పదు. ఆర్థిక వ్యవస్థ నష్టాలను ప్రధాని ఇవాళ ప్రజలకు వివరించే అవకాశం ఉంది.
లాక్డౌన్ మొదటి 15 రోజుల్లో... దేశంలో ట్రక్కర్లకు రూ.35200 కోట్ల నష్టం వాటిల్లింది. ఒక్కో ట్రక్కూ రోజూ రూ.2200 నష్టం జరిగింది. దేశంలో ఉన్న కోటి ట్రక్కుల్లో 90 లక్షల వరకు రోడ్డెక్కలేదు. ఇక రియాల్టీ రంగం రూ.లక్ష కోట్లు నష్టపోయింది. మార్చిలో దేశంలోని రిటైల్ వ్యాపారానికి రెండు లక్షల కోట్ల రూపాయలు పైగా నష్టం జరిగింది. దేశంలోని 7 కోట్ల చిన్న, పెద్ద వ్యాపారులు ద్వారా 45 కోట్ల మందికి ఉపాధి లేకుండా తీవ్రంగా నష్టపోయారు.