భారత్ లో రోజురోజుకు పెరుగుతున్న కరోనా కేసులు.. కోలుకున్న వారి లెక్క ఇది..
భారత్ లో కరోనా వైరస్ మహమ్మారి రోజురోజుకు విజృంభిస్తోంది. ఇప్పటికే 562 కేసులు నమోదయ్యాయి.
భారత్ లో కరోనా వైరస్ మహమ్మారి రోజురోజుకు విజృంభిస్తోంది. ఇప్పటికే 562 కేసులు నమోదయ్యాయి. వీరిలో 40 మంది కోలుకోగా.. 9 మంది మృతి చెందారని కేంద్ర ఆరోగ్య శాఖా వెల్లడించింది. దేశంలోనే అత్యధికంగా 106 కేసులు మహారాష్ట్రలో నమోదయ్యాయి. ఇందులో ముగ్గురు విదేశీయులు ఉండగా.. మిగతావి విదేశాల నుంచి రాష్ట్రానికి వచ్చిన వారు ఉన్నారు. మహారాష్ట్ర తరువాత కేరళ రాష్ట్రంలో 95 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇందులో కూడా 8మంది విదేశీయులు ఉన్నారు. అయితే 95 మందిలో ఇప్పటికే నలుగురు కోలుకొని ఇంటికి వెళ్లారు. వారిలో ముగ్గురు భారత్ లో వైరస్ తీవ్రత పెరగక ముందే కోలుకున్నారు.
వారిని ఫిబ్రవరిలోనే డిశ్చార్జ్ చేశారు. కర్ణాటకలో 37 కేసులు నమోదు కాగా వారిలో ఇద్దరు కోలుకున్నారు. ఒక వ్యక్తి మరణించాడు. తెలంగాణలో 39 కేసులు నమోదయ్యాయి. వీరిలో చాలా మంది వచ్చే నెల డిశ్చార్జ్ అవకాశం ఉంది. ఇక ఉత్తర ప్రదేశ్లో 32 కేసులు నమోదు కాగా.. ఇందులో ఒక విదేశీయుడు ఉన్నాడు. 32 మందిలో ఇప్పటికే 9 మంది కోలుకున్నారు. ఇక రాజస్థాన్లో 31 కేసులు నమోదయ్యాయి. ఇందులో ఇద్దరు విదేశీయులున్నారు. ముగ్గురు బాధితులు కోలుకోవడంతో వారిని డిశ్చార్చ్ చేశారు. ఢిల్లీలో 30 కేసులు నమోదు అయ్యాయి, ఇందులో ఒక విదేశీయుడు ఉన్నాడు. ఆరుగురు కోలుకున్నారు.
గుజరాత్ లో 29, హర్యానా లో 26, పంజాబ్లో 21, తమిళనాడులో 12 కేసులు నమోదయ్యాయి. పంజాబ్లో ఒకరు చనిపోగా హర్యానాలో 11 మంది కోలుకున్నారు. ఆంధ్రప్రదేశ్ లో 9 కేసులు నమోదు కాగా నెల్లూరులో నమోదైన మొదటి వ్యక్తి కోలుకున్నారు. అతన్ని ఇప్పటికే డిశ్చార్జ్ చేశారు. మధ్యప్రదేశ్-7, బెంగాల్-7, హిమాచల్ ప్రదేశ్-3, బిహార్-2, ఒడిశా-2 కేసులు రిజిస్టర్ చేశారు. ఇదిలావుంటే ఇటలీలో చిక్కుకున్న277 మంది భారతీయుల్ని రెండు ఎయిర్ ఇండియా విమానాల ద్వారా రాజస్థాన్లోని జోధ్పూర్ విమానాశ్రయానికి తీసుకువచ్చారు. వీరికి ప్రస్తుతం పరీక్షలు చేస్తున్నారు.