హేమంత్ సోరెన్ అరెస్టు.. సీఎం పదవికి రాజీనామా
Hemant Soren: ఝార్ఖండ్ ముఖ్యమంత్రిగా చంపయీ సోరెన్
Hemant Soren: భూ కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో విచారణను ఎదుర్కొంటున్న ఝార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ బుధవారం రాజీనామా చేశారు. ఆయన స్థానంలో ఝార్ఖండ్ ముక్తి మోర్చా సీనియర్ నేత, రవాణాశాఖ మంత్రి చంపయీ సోరెన్ను జేఎంఎం సంకీర్ణ శాసనసభాపక్ష నేతగా ఎమ్మెల్యేలు ఎన్నుకున్నారు. దీంతో కొత్త ముఖ్యమంత్రిగా ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు. అంతకుముందు బుధవారం రోజంతా కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ హేమంత్ సోరెన్ నివాసానికి చేరుకుని 7 గంటలకుపైగా ప్రశ్నించింది. ఆ తరువాత ఆయనను అరెస్టు చేసింది. విచారణ, అరెస్టు నేపథ్యంలో రాంచీలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. తొలుత సోరెన్ భార్య కల్పనా సోరెన్ను ముఖ్యమంత్రిని చేస్తారని ఊహాగానాలొచ్చాయి. అయితే దీనిపై కుటుంబంలోనే విభేదాలు తలెత్తడంతో చివరకు పార్టీ సీనియర్ నేత చంపయీ సోరెన్ను ముఖ్యమంత్రిని చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. కల్పనా సోరెన్ ముఖ్యమంత్రి కాకుండా తోటి కోడలు సీతా సోరెన్ అడ్డుపుల్ల వేసినట్లు సమాచారం.
భారీ భద్రత నడుమ నిన్న మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో రాంచీలోని హేమంత్ సోరెన్ అధికారిక నివాసానికి ఈడీ బృందాలు చేరుకున్నాయి. మరోవైపు రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి ఆయన మద్దతుదారులు రాంచీకి చేరుకున్నారు. అటు విచారణ సమయంలో అదనపు భద్రత కల్పించాలని ఈడీ కోరినట్లు సమాచారం. దీనికి సంబంధించి ఝార్ఖండ్ ప్రభుత్వానికి ముందస్తుగానే లేఖ రాసినట్లు తెలిసింది. ఈడీ విచారణ నేపథ్యంలో హేమంత్ తన తండ్రి, జేఎంఎం అధినేత శిబు సోరెన్ ఆశీర్వాదం తీసుకున్నట్లు సమాచారం. హేమంత్ను ఈడీ అధికారులు 7 గంటలకుపైగా ప్రశ్నించారు. మొత్తం 15 ప్రశ్నలను సంధించగా ఆయన సమాధానాలివ్వలేదని తెలిసింది. ఆ తరువాత ఆయనను కస్టడీలోకి తీసుకున్నారని జేఎంఎం ఎంపీ మహువా మాఝీ తెలిపారు. బుధవారం రాత్రి హేమంత్ను ఆయన ఇంటి నుంచి ఈడీ కార్యాలయానికి తరలించారు. ఆ తర్వాత అరెస్టు చేసినట్లు ఈడీ అధికారులు ప్రకటించారు. మరోవైపు హేమంత్ రాజీనామాను గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ ఆమోదించారు.
జేఎంఎం సంకీర్ణ శాసనసభా పక్ష నేతగా చంపయీ సోరెన్ను ఎన్నుకున్నట్లు ఝార్ఖండ్ పీసీసీ అధ్యక్షుడు రాజేశ్ ఠాకుర్ తెలిపారు. ఆ తరువాత గవర్నర్ సీపీ రాధాకృష్ణన్కు ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ రాజీనామా లేఖ అందజేశారని వెల్లడించారు. తమకు 47 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని చెప్పారు. చంపయీ సోరెన్ ప్రస్తుతం రవాణాశాఖ మంత్రిగా ఉన్నారు. సెరికెల అసెంబ్లీ స్థానం నుంచి ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 1991 నుంచి 3 దశాబ్దాలుగా ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారు. జేఎంఎం అధినేత శిబు సోరెన్కు అత్యంత సన్నిహితుడు. 1956లో జిలింగోరా గ్రామంలో చంపయీ సోరెన్ జన్మించారు. మెట్రిక్యులేషన్ చదివారు. ఆయనకు ఏడుగురు పిల్లలున్నారు. శిబు సోరెన్తో ఎటువంటి బంధుత్వం లేదు. ఈడీ అధికారులపై హేమంత్ సోరెన్ పోలీసు కేసు పెట్టారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద చర్యలు తీసుకోవాలని ఆయన ఫిర్యాదు చేశారు.
ముఖ్యమంత్రి పదవిపై సోరెన్ కుటుంబంలో ఇంటిపోరు బయటపడింది. హేమంత్ సతీమణి కల్పనా సోరెన్ను ముఖ్యమంత్రిని చేసేందుకు తాను వ్యతిరేకమంటూ జేఎంఎం అధినేత శిబు సోరెన్ పెద్ద కోడలు సీతా సోరెన్ బహిరంగ ప్రకటన చేశారు. ఎమ్మెల్యేగా ఎన్నిక కాని, రాజకీయ అనుభవం లేని కల్పననే ఎందుకు? పార్టీలో ఎంతో మంది సీనియర్ నేతలుండగా.. ఆమె పేరునే ఎందుకు ప్రచారం చేస్తున్నారు.. కుటుంబం నుంచే సీఎంను ఎన్నుకోవాలంటే ఇంట్లో తానే సీనియర్ని తెలిపారు.14 ఏళ్లుగా ఎమ్మెల్యేగా కొనసాగుతున్నానని అన్నారు. కల్పనను ముఖ్యమంత్రి చేయాలనే ఏ చర్యపైనైనా గట్టిగా నిరసన వ్యక్తం చేస్తా అని దుర్గా సోరెన్ భార్య, ప్రస్తుత ఎమ్మెల్యే సీతా సోరెన్ పేర్కొన్నారు.