క్వారంటైన్ సెంటర్లపై ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు.. దేశద్రోహం కింద అరెస్టు
కరోనా వైరస్ దేశవ్యాప్తంగా వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో దేశంలో పరిస్థితులు ఆందోళనకరంగా మారాయి.
కరోనా వైరస్ దేశవ్యాప్తంగా వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో దేశంలో పరిస్థితులు ఆందోళనకరంగా మారాయి. కరోనా నివారణకు ప్రభుత్వాలు అనేక చర్యలు తీసుకున్నాయి. ప్రాణాంత వైరస్ సోకినట్లు అనుమానం ఉన్న వారిని క్వారంటైన్, ఐసోలేషన్ వార్డులకు తరలిస్తున్నారు. అయితే ఓ ఎమ్మెల్యే క్వారంటైన్ సెంటర్లపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆయనపై దేశద్రోహం నేరం కింద అరెస్టు చేశారు. అసోం రాష్ట్రంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. అసోం చెందిన ఏఐడీయూఎఫ్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే అమినుల్ ఇస్లామ్ క్వారంటైన్ సెంటర్ల గురించి మరో వ్యక్తితో మాట్లాడిన ఆడియో క్లిప్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. అందులో ఆయన క్వారంటైన్లు నిర్భంద కేంద్రాలు.., చాలా ప్రమాదకరమైనవి అని అన్నట్లు సమాచారం.
అసోం బీజేపీ ప్రభుత్వంపై కూడా అమినుల్ తీవ్ర స్థాయిలో నిప్పులుకక్కారు. ముస్లిం పట్ల బీజేపీ ప్రభుత్వం వివక్ష చూపుతోందని ఆయన అన్నారు. ఢిల్లీలోని నిజాముద్ధీన్ తబ్లిగీ జమాత్ వెళ్లొచ్చిన వెళ్లివచ్చిన వారితో వైద్య సిబ్బంది కఠినంగా వ్యవహరిస్తున్నారని అమినుల్ ఆరోపించారు. ఆరోగ్యంగా ఉన్న వాళ్లకి సైతం కరోనా వ్యాధి ఉన్నవారిలా చిత్రీకరిస్తున్నారని అమినుల్ ఆ ఆడియోలో పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేపై వివిధ సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం ఆయన్ను అరెస్టు చేసి పోలీసు స్టేషన్ కు తరలించారు. పోలీసుల విచారణలో ఆ ఆడియో క్లిప్లో వాయిస్ తనదేనని ఎమ్మెల్యే అంగీకరించారు. తానే వాట్సాప్లో షేర్ చేసినట్లు ఎమ్మెల్యే అంగీకరించారని పోలీసులు తెలిపారు. అస్సోం స్పీకర్కు పూర్తి సమాచారం ఇచ్చామని డీజీపీ భాస్కర్ మహంతా స్పష్టం చేశారు.