రెండు రోజుల భారత పర్యటనలో భాగంగా ఈ నెల 25న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఆయన భార్య, అమెరికా ప్రథమ మహిళ మెలానియా ట్రంప్ ఢిల్లీలోని ప్రభుత్వ పాఠశాలను సందర్శించనున్నారు. అక్కడ నిర్వహించే ' హ్యాపీనెస్ క్లాస్' గురించి అడిగి తెలుసుకుంటారు. అయితే ఈ కార్యక్రమానికి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు ఆహ్వానం అందలేదని ఆప్ వర్గాలు వెల్లడించాయి. ముందుగా ఈ కార్యక్రమంలో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియాలు కూడా భాగస్వాములు అవుతారని వార్తలు వచ్చాయి. కానీ అలాంటిది ఏమీ లేదని ఢిల్లీ ప్రభుత్వం స్పష్టం చేసింది.
ఈ నేపధ్యంలో ఆప్ నాయకురాలు ప్రీతిశర్మ మీనన్ ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ.. కావాలనే కేంద్రం ఢిల్లీ సీఎంను పక్కనపెట్టిందని, తమ ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులే కేజ్రీవాల్ గురించి బెబుతాయని ఆమె ట్వీట్ చేశారు. అయితే ఈ ట్వీట్ పైన బీజేపీ ప్రతినిధి సంబిత్ పత్రా స్పందిస్తూ.. , "కొన్ని విషయాలపై రాజకీయాలు చేయడం సరికాదు. మనం ఒకరినొకరు కాళ్ళు లాగడం మొదలుపెడితే భారతదేశం అపఖ్యాతి పాలవుతుంది. భారత ప్రభుత్వం అమెరికాను ప్రభావితం చేయదు, ఎవరిని ఆహ్వానిస్తారనేది ఆ దేశం చేతుల్లో ఉందని అయన విమర్శించారు
ఇక ట్రంప్ పర్యటనకు గాను భారత ప్రభుత్వం భారీ ఏర్పాట్లను చేస్తోంది. ఈ నెల 24, 25 తేదీల్లో దేశంలో ట్రంప్ రెండురోజుల పర్యటించనున్నారు. తొలిరోజు గుజరాత్లోని అహ్మదాబాద్ విమానాశ్రయం నుంచి ఇటీవలనే నిర్మించిన ప్రపంచంలోనే అతిపెద్ద మోతెరా స్టేడియం దాకా 22 కి.మీ. రోడ్షో నిర్వహిస్తారు. అనంతరం మొతెరా క్రికెట్ స్టేడియంలో జరిగే 'నమస్తే ట్రంప్' కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం ఆగ్రాలోని తాజ్ మహల్ ని సందర్శిస్తారు. ఇక 25వ తేదీన ట్రంప్, మోదీల మధ్య ప్రతినిధుల స్థాయి చర్చలు జరుగుతాయి