మర్కజ్ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై ఎఫ్ఐఆర్ నమోదు : అరవింద్ కేజ్రీవాల్
గత రెండు రోజులుగా దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కేసులు పెరుగుతున్నాయని సీఎం కేజ్రివాల్ అన్నారు.
గత రెండు రోజులుగా దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కేసులు పెరుగుతున్నాయని సీఎం కేజ్రివాల్ అన్నారు. ఇప్పటికి ఢిల్లీలో 97 కేసులు నమోదు కాగా, అందులో 41 మంది విదేశాల నుంచి వచ్చినవారేనని అన్నారు. మంగళవారం మీడియాతో మాట్లాడిన అయన 24 మంది కరోనా బాధితులు మర్కజ్ సమావేశంలో పాల్గొన్నారని, మర్కజ్ భవనం నుంచి 1548 మందిని బయటకు తీసుకొచ్చామని, వారిలో 441 మందికి కరోనా లక్షణాలున్నాయని వెల్లడించారు.
ప్రస్తుతం వారంతా ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారని తెలిపారు. మర్కజ్ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసేలా ఆదేశాలు ఇవ్వాలని లెఫ్టినెంట్ గవర్నర్కు లేఖ రాశామని తెలిపారు. ఎవరు ఏ మతానికి చెందిన వారైనా వారి ప్రాణాలు విలువైనవి అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని అన్ని మతాల పెద్దలకు సూచించారు. మార్చి 8-10 తేదీలలో తబ్లిఘి జమాత్ నిర్వహించిన సమావేశానికి 2 వేల మంది ప్రజలు బస చేశారు. వారిలో చాలామంది వివిధ రాష్ట్రాలను సందర్శించారు.