America: కేజ్రీవాల్ అరెస్టు.. స్పందించిన అమెరికా
America: అమెరికా వ్యాఖ్యలను ఖండించిన భారత్
America: మద్యం విధానానికిసంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఢిల్లీ సీ అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు వ్యవహారంలో ఇతర దేశాలు జోక్యం చేసుకోవడం చర్చనీయాంశంగా మారుతోంది. మొన్నామధ్య జర్మనీ దీని పై ప్రకటన విడుదల చేయగా, తాజాగా అగ్రరాజ్యం అమెరికాకూడా స్పందించింది. ఈ పరిణామాలను తీవ్రంగా పరిగణించిన భారత్ చర్యలు చేపట్టింది. ఢిల్లీలోని యూఎస్ దౌత్యవేత్తకు సమన్లు జారీ చేసింది.
కేజ్రీవాల్ అరెస్టుపై ఈ-మెయిల్లో అడిగిన ఓ ప్రశ్నకు అమెరికా విదేశాంగశాఖ అధికార ప్రతినిధి బదులిచ్చారు. భారత్లోని ప్రతిపక్ష నేత అరెస్టుకు సంబంధించిన నివేదికలను నిశితంగా పరిశీలిస్తున్నామని, ఈ కేసులో పారదర్శక విచారణను ప్రోత్సహిస్తున్నామని పేర్కొన్నారు. దీనిపై ఢిల్లీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.
అంతకుముందు జర్మనీ విదేశాంగశాఖ కూడా ఇదే విధమైన అధికారిక ప్రకటన విడుదల చేసింది. ‘భారత్ ప్రజాస్వామ్య దేశం. ఆరోపణలు ఎదుర్కొంటున్న కేజ్రీవాల్ న్యాయపరమైన, నిష్పాక్షికమైన విచారణకు అర్హులు. అందుబాటులో ఉన్న చట్టపరమైన మార్గాలను ఎలాంటి పరిమితులు లేకుండా ఆయన వినియోగించుకోవచ్చని ఆ ప్రకటనలో పేర్కొంది. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసిన భారత్.. ఆ దేశ రాయబారికి సమన్లు ఇచ్చింది. ఇది తమ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడమేనని మండిపడింది.