భారతదేశ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ చంద్రయాన్-2. చంద్రుని విశేషాలను మరింత కూలంకషంగా తెలుసుకోవడానికి పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో చంద్రయాన్-2 కు రూపకల్పన చేసింది ఇస్రో. మరి కొన్ని గంటల్లో జీఎస్ఎల్వీ-మార్క్3ఎం1 వాహకనౌక(రాకెట్) ఉపగ్రహాన్ని తీసుకుని బయలుదేరనుంది. ఈరోజు మధ్యాహ్నం 2.43 గంటలకు పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ షార్లో ఉన్న రెండో ప్రయోగ వేదిక నుంచి చంద్రయాన్-2 ప్రయోగం జరపడానికి సన్నాహాలు పూర్తయ్యాయి. ఈమేరకు కౌంట్ డౌన్ నిన్న సాయంత్రం 6.43 గంటలకు ప్రారంభమైంది. ఈ ప్రయోగం ద్వారా జీఎస్ఎల్వీ-మార్క్3ఎం1 వాహకనౌక 3.8 టన్నుల బరువుగల చంద్రయాన్-2 ఉపగ్రహాన్ని నిర్ణీత కక్ష్యలోకి ప్రవేశపెడుతుంది.
ఒక్క నిమిషమే!
ఈ ప్రయోగానికి అత్యవసరమైన లాంచ్ విండో ఒక్క నిమిషం మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఈ సమయంలో ప్రయోగం జరిగిపోవాలి. గత తమ అనుభవాల దృష్ట్యా ఇది పెద్ద కష్టమైన పని కాదని ఇస్రో శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కచ్చితంగా ఒక్క నిమిషంలో ప్రయోగం పూర్తి చేస్తామని విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల 15 తెల్లవారుజామున చంద్రయాన్-2ను నింగిలోకి పంపేందుకు 10 నిమిషాల లాంచ్ విండో అందుబాటులో ఉన్నప్పటికీ, దురదృష్టవశాత్తూ ఆరోజు ప్రయోగానికి 56 నిమిషాల ముందు క్రయోజెనిక్ ట్యాంకర్లో సాంకేతిక తలెత్తడంతో 56 నిమిషాల ముందు ప్రయోగాన్ని వాయిదా వేసిన సంగతి తెలిసిందే. ప్రయోగ వేదిక నుంచి రాకెట్ బయలుదేరిన తరువాత 16.13 నిమిషాలపాటు ప్రయాణించి, నిర్ణీత కక్ష్యలోకి ప్రవేశించిన పిదప చంద్రయాన్-2 రాకెట్ నుంచి విడిపోతుంది.