Airport Security: దేశవ్యాప్తంగా విమానాశ్రయాలకు ఉగ్ర ముప్పు...ఇంటెలిజెన్స్ హెచ్చరిక
Airport Security: దేశంలోని అన్ని ప్రధాన ఎయిర్ పోర్టులకు ఉగ్ర ముప్పు ఉన్నట్టు నిఘా వర్గాలు హెచ్చరించాయి. దాడులకు ఉగ్రవాదులు, సంఘ వ్యతిరేక శక్తులు ప్రయత్నించే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ నివేదికలు వెల్లడించాయి.
Airport Security: దేశంలోని అన్ని ప్రధాన ఎయిర్ పోర్టులకు ఉగ్ర ముప్పు ఉన్నట్టు నిఘా వర్గాలు హెచ్చరించాయి. దాడులకు ఉగ్రవాదులు, సంఘ వ్యతిరేక శక్తులు ప్రయత్నించే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ నివేదికలు వెల్లడించాయి. ఈ మేరకు కేంద్ర పౌర విమానయాన భద్రతా సంస్థ (BCAS) అన్ని ఎయిర్ పోర్టులకు హెచ్చరికలతో కూడిన అడ్వైజరీ జారీ చేసింది.
సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 2 వరకు అపాయం
ఇంటెలిజెన్స్ నివేదికల ప్రకారం, ఈ ఏడాది సెప్టెంబర్ 22 నుండి అక్టోబర్ 2 వరకు దాడులు జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో విమానాశ్రయాల్లో హై అలర్ట్ ప్రకటించారు. దేశంలోని అన్ని విమానాశ్రయాల్లో భద్రతను కట్టుదిట్టం చేయాలని, ముఖ్యంగా రన్వేలు, హెలీపాడ్లు, ఫ్లయింగ్ స్కూల్స్, ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్ల వద్ద భద్రతను మరింత పెంచాలని సూచించారు.
అలర్ట్ అయిన భద్రతా సిబ్బంది
భద్రతా బలగాలు, సీఐఎస్ఎఫ్ సిబ్బంది టెర్మినల్స్, పార్కింగ్ ఏరియాలు, పెరీమీటర్ జోన్లలో పెట్రోలింగ్ పెంచారు. అదే సమయంలో విమానాశ్రయాల వద్ద రోడ్లపై తనిఖీలు ప్రారంభమయ్యాయి. స్థానిక పోలీసులతో కలిసి మల్టీ లెవెల్ చెకింగ్ ఏర్పాటు చేశారు. విమానాశ్రయ సిబ్బంది, కాంట్రాక్టర్లు, విజిటర్లను కూడా నిర్ధిష్ట పద్ధతిలో తనిఖీ చేయాలని ఆదేశించారు.
ప్రయాణికులకు సూచనలు
అనుమానాస్పద వ్యక్తులు లేదా వస్తువులు కనపడితే వెంటనే ఎయిర్పోర్ట్ అధికారుల దృష్టికి తీసుకురావాలని అధికారాలు ప్రయాణికులకు సూచించాయి. తమకు అందిన సమాచారం మేరకు అత్యంత జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు అధికారులు తెలిపారు.
ఈ నేపథ్యంలో ప్రయాణికులు తమ పాస్పోర్ట్, టికెట్లు ముందుగానే సిద్ధం చేసుకుని, ముందస్తుగా ఎయిర్పోర్ట్కు చేరుకోవాలని సూచించారు. భద్రత కోసం తీసుకుంటున్న చర్యల్లో సహకరించాలని విజ్ఞప్తి చేశారు.