మావోయిస్టు పార్టీకి మరో ఎదురుదెబ్బ.. ఛత్తీస్గఢ్ సుక్మా జిల్లాలో 26 మంది లొంగుబాటు!
ఛత్తీస్గఢ్లోని మావోయిస్టుల కోటగా పిలవబడే బస్తర్ రీజియన్లో ఆ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది.
ఛత్తీస్గఢ్లోని మావోయిస్టుల కోటగా పిలవబడే బస్తర్ రీజియన్లో ఆ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. సుక్మా జిల్లాలో ఏకకాలంలో 26 మంది మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోయారు. జనజీవన స్రవంతిలోకి రావాలన్న ప్రభుత్వ పిలుపు, పోలీసుల ‘పూన నర్కోమ్’ (కొత్త ఉదయం) ప్రచార కార్యక్రమానికి ఆకర్షితులై వీరంతా ఆయుధాలు వీడారు.
కీలక నేతలు.. రూ. 64 లక్షల రివార్డు
లొంగిపోయిన వారిలో మావోయిస్టు పార్టీలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న వారు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. వీరి ప్రస్థానంపై ప్రభుత్వం గతంలోనే భారీ రివార్డులను ప్రకటించింది. లొంగిపోయిన 26 మందిపై కలిపి ప్రభుత్వం 64 లక్షల రూపాయల రివార్డును ప్రకటించింది. వీరంతా మావోయిస్టు పార్టీకి చెందిన మార్వార్ డివిజన్ మరియు PLGA (Peoples Liberation Guerrilla Army) కమిటీ సభ్యులుగా గుర్తించబడ్డారు.
ఛత్తీస్గఢ్ పోలీసు యంత్రాంగం, సిఆర్పిఎఫ్ (CRPF) అధికారుల సమక్షంలో ఈ లొంగుబాటు ప్రక్రియ జరిగింది. మావోయిస్టు భావజాలం పట్ల విరక్తి చెంది, అభివృద్ధి వైపు మొగ్గు చూపుతూ వీరంతా లొంగిపోయినట్లు ఎస్పీ తెలిపారు. లొంగిపోయిన వారికి ప్రభుత్వ నిబంధనల ప్రకారం తక్షణ సహాయం అందించి, పునరావాసం కల్పిస్తామని అధికారులు హామీ ఇచ్చారు.
ఇటీవలి కాలంలో ఛత్తీస్గఢ్లో మావోయిస్టుల ఏరివేత చర్యలు వేగవంతం కావడం, కీలక ఎన్కౌంటర్లు జరగడంతో దళ సభ్యులలో అభద్రతాభావం పెరిగి లొంగుబాట్లు పెరుగుతున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.