Tollywood Movies: టాలీవుడ్లో కొత్త ట్రెండ్.. ప్రేక్షకుల సహనమే కారణమా?
తెలుగు సినిమా పరిశ్రమలో ఇప్పుడు మరో ఆసక్తికరమైన ట్రెండ్ స్పష్టంగా కనిపిస్తోంది. ఒకప్పుడు 2 గంటల 20 నిమిషాల నుంచి 2 గంటల 30 నిమిషాల వరకు సినిమాల రన్టైమ్ ఉండేది.
Tollywood Movies: టాలీవుడ్లో కొత్త ట్రెండ్.. ప్రేక్షకుల సహనమే కారణమా?
తెలుగు సినిమా పరిశ్రమలో ఇప్పుడు మరో ఆసక్తికరమైన ట్రెండ్ స్పష్టంగా కనిపిస్తోంది. ఒకప్పుడు 2 గంటల 20 నిమిషాల నుంచి 2 గంటల 30 నిమిషాల వరకు సినిమాల రన్టైమ్ ఉండేది. కొన్ని మూవీస్ అయితే 2 గంటల 10 నిమిషాలు కూడా ఉండేవి కాదు. ఆ మధ్య 2 గంటల కంటే తక్కువ నిడివితో కూడా వచ్చాయి. కానీ ఇప్పుడు స్టార్ హీరోల సినిమాలు మాత్రం ఏకంగా 3 గంటలకు పైగా నిడివితో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. ఇప్పుడు ఇది రావడం టాలీవుడ్లో సాధారణంగా మారుతోంది.
సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి కాంబినేషన్లో రూపొందుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘వారణాసి’ ఇప్పటికే 3 గంటల రన్టైమ్తో రూపొందుతున్నట్లు కన్ఫర్మ్ అయ్యింది. భారీ కథాంశం, ఎమోషన్, యాక్షన్తో పాటు రాజమౌళి మార్క్ విజువల్ గ్రాండ్యూర్ కారణంగా ఈ నిడివి అవసరమైందని టాక్ వినిపిస్తోంది. ఇక రెబల్ స్టార్ ప్రభాస్ వరుసగా 3 గంటల సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతుండటం గమనార్హం. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘స్పిరిట్’ కూడా దాదాపు 3 గంటల రన్టైమ్ ఉంటుందని అంచనా వేస్తున్నారు. అలాగే ప్రభాస్ నటిస్తున్న మరో చిత్రం ‘ఫౌజీ’ కూడా 3 గంటల నిడివితోనే రూపొందుతుందనే ప్రచారం సాగుతోంది.
గతంలో విడుదలైన పలు సినిమాలు కూడా సుదీర్ఘ రన్టైమ్తోనే వచ్చాయి. ‘పుష్ప: ది రూల్’, ‘ది రాజాసాబ్’, అలాగే ‘సాలార్’ (దాదాపు 3 గంటలకు చేరువగా) వంటి సినిమాలు పొడవైన నిడివితో విడుదలై బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లు సాధించాయి. మాస్ ఎలివేషన్స్, పాత్రల డెప్త్, వరల్డ్ బిల్డింగ్, యాక్షన్ బ్లాక్స్ అన్నింటినీ పూర్తి స్థాయిలో చూపించాలంటే ఇప్పుడు దర్శకులు ఎక్కువ రన్టైమ్ను ఎంచుకుంటున్నారని విశ్లేషకులు చెబుతున్నారు. ఓటిటి అలవాట్లు, ప్రేక్షకుల సహనం పెరగడం కూడా ఈ ట్రెండ్కు కారణమని అభిప్రాయం. మొత్తంగా చూస్తే.. టాలీవుడ్లో 3 గంటల సినిమా ఇక అసాధారణం కాదనే చెప్పాలి. భారీ సినిమాలకు ఇది సాధారణంగా మారుతోందని స్పష్టంగా చెప్పొచ్చు. ఈ ట్రెండ్ ఇలానే కొనసాగుతుందా? లేదా మళ్లీ అప్పటి నిడివి సినిమాలు వస్తాయా? అన్నది చూడాల్సిందే.